'జగన్పార్టీ పది సూత్రాలు: బిజెపికన్నా మతతత్వ పార్టీ'
హిందూ పూజారులు ఎవరూ ఫలానా వారికి ఓటు వేయాలని గుళ్లలో ప్రమాణాలు, ప్రతిజ్ఞలు చేయించలేదని కానీ, ఇటీవలి ఉప ఎన్నికల సమయంలో చర్చిల్లో బైబిల్ పైనా శిలువ పైనా జగన్ పార్టీకి ఓటు వేయాలని ప్రమాణం చేయించి పంపించారని ఆరోపించారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ను అడ్డుపెట్టుకొని క్రైస్తవ మతాన్ని విస్తరింపచేయడానికి... ఆ మతంలోని వారందరితో కేవలం తమ పార్టీకే ఓట్లు వేయించుకునే కుట్ర పన్నుతున్నారన్నారు.
క్రైస్తవ మత ప్రచారానికి విదేశాల నుంచి వస్తున్న డబ్బు, తమ అవినీతి డబ్బును గుమ్మరించి మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజల పేదరికాన్ని ఆసరాగా తీసుకొని డబ్బులు విరజిమ్మి మత మార్పిళ్లకు పూనుకోవడం హేయమని, ఇది అనైతికం కాబట్టే ప్రశ్నిస్తున్నామన్నారు. వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పాపాలకు ఐఏఎస్ అధికారుల నుంచి మేజిస్ట్రేట్లదాకా ఎంతో మంది బలయ్యారన్నారు.
ఆ పాపాల వల్లే ఇప్పుడు జగన్ జైలులో ఉన్నాడన్నారు. పులివెందుల ప్రాంతంలో తమ మాట వినని వారి ప్రాణాలు, ఆస్తులను వైయస్ కుటుంబం కబళించిందని, పాతికేళ్ల నుంచి ఆ ప్రాంతంలో ఆ కుటుంబం పాల్పడిన ఘోరాలకు అంతే లేదన్నారు. ఆ కుటుంబం చేసిన ఘోరాలపై తాము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు.
సాధారణంగా అన్ని పార్టీలు పక్కా సిద్ధాంతాలు, విధానాలతో ప్రజల్లోకి వెళతాయని.. కానీ జగన్ పార్టీ మాత్రం ఆయనకు, ఆయన కుటుంబానికి ప్రయోజనం చేకూరేలా ఎజెండాను తయారు చేసుకుందని పార్టీ మరో సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. జగన్, ఆయన కుటుంబ ప్రయోజనాలే లక్ష్యంగా ఆ ఎజెండాలో పది సూత్రాలను పొందుపర్చారన్నారు.
జగన్ను జైలునుంచి బయటకు తీసుకురావడమే ప్రధాన కర్తవ్యం, కాంగ్రెస్తో చేతులు కలపడంద్వారా జగన్పై కేసులను నీరుగార్చడం, రాష్ట్రపతి, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల వంటి కష్టకాలాల్లో కాంగ్రెస్కు ఓటు వేయడం, సోనియాకు ఎక్కడా వ్యతిరేకంగా మాట్లాడకపోవడం, ఢిల్లీ చుట్లూ ప్రదక్షిణలు, అవినీతి సంపదను రక్షించుకోవడం, జైలులో ములాఖత్ల ద్వారా ఫిరాయింపులను ప్రోత్సహించడం, రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలను కొనసాగించడం లాంటి సూత్రాలే ఆ పార్టీ ఎజెండా అని ధ్వజమెత్తారు.