జోక్ అన్నప్పటికీ..: జగన్, బాబును కార్నర్ చేసేందుకే
అఖిల పక్ష సమావేశంలో తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఏం చెబుతుందనే దానిపై పార్టీ నేతలతో చర్చల్లో మునిగిపోయారట. వారు ఏం చెప్పినా కౌంటర్ వేసేందుకు సిద్ధంగా ఉండాలనే భావనలో కెసిఆర్ ఉన్నారట. తెలంగాణ ప్రాంతంలో మంచి క్యాడర్ కలిగి ఉన్న టిడిపిని, ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను దెబ్బకొట్టడమే కెసిఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని అంటున్నారు.
తాము గతంలోనే తెలంగాణపై లేఖ ఇచ్చామని, దానిని వెనక్కి తీసుకోలేదని, తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని, కేంద్రం ఇస్తే మేం వ్యతిరేకించమనే అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీ అఖిల పక్షంలో తెలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణ ప్రజల మనోభావాల్ని గుర్తించామని, కేంద్రం ఇస్తే మాకు అభ్యంతరం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెప్పనుందని అంటున్నారు. ఇలా టిడిపి, జగన్ పార్టీ ఏమేం చెబుతాయో వాటిపై కెసిఆర్ కసరత్తు చేస్తున్నారట.
వ్యతిరేకం కాదని చెప్పినా, ఇస్తే అభ్యంతరం లేదని చెప్పినా అవి తప్పించుకునేందుకేనని తెలంగాణవాదులు ఇప్పటికే చెబుతున్నారు. టిడిపి, జగన్ పార్టీ అలాగే చెబితే దానిని బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు తెరాస సిద్ధంగా ఉంది. కెసిఆర్ అఖిల పక్ష సమావేశానికి వెళ్లడం వెనుక వ్యూహం జగన్ పార్టీని, టిడిపిని దెబ్బతీసేందుకేననే అంటున్నారు. ఆ రెండు పార్టీలు లేకుంటే అఖిల పక్షాన్ని బహిష్కరించి ఉండేవారంటున్నారు.
అఖిల పక్ష సమావేశానికి పార్టీ నుండి ఇద్దర్ని పిలిస్తే తాము వెళ్లేది లేదని గతంలో కెసిఆర్, తెరాస పలుమార్లు స్పష్టం చేసింది. బిజెపి కూడా అదే చెప్పింది. అంతేకాకుండా ఇటీవల అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు షిండే ప్రకటించిన తర్వాత కెసిఆర్ స్పందిస్తూ.. అదో జోక్ అన్నారు. తెరాస నేతలు కూడా ఎఫ్డిఐల నుండి గట్టెక్కేందుకే అని చెప్పారు. ఇద్దర్ని పిలిస్తే వెళ్లమని చెప్పినప్పటికీ, జోక్ అని కామెంట్ చేసినప్పటికీ కెసిఆర్ వెళ్లడం వెనుక జగన్, బాబులను కార్నర్ చేసేందుకే అంటున్నారు.