నువ్వా-నేనా: తెలంగాణపై ఆ ముగ్గురు ఢీ అంటే ఢీ
తెరాస తెలంగాణ వాదం వినిపిస్తున్న మరో పార్టీ భారతీయ జనతా పార్టీపై మాట్లాడటం పూర్తిగా మానేసింది. మాట్లాడటం ద్వారా బిజెపికి మరింత పేరు వస్తుందే తప్ప నష్టం లేదు అన్న భావనలో ఆ పార్టీ ఉన్నట్లుగా కనిపిస్తోంది. తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇటీవల బిజెపిపై మాట్లాడవద్దని పార్టీ నేతలను కూడా ఆదేశించారు. ఇంకో వైపు జెఏసి అఖిల పక్షంలో తెలంగాణకు అనుకూలంగా అభిప్రాయం చెప్పని పార్టీలను టార్గెట్ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది.
వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు తెలంగాణపై స్ఫష్టమైన వైఖరి చెప్పకపోయినా.. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని, తెలంగాణ ప్రజల మనోభావాల్ని గౌరవిస్తామని చెబుతున్నారు. దీని ద్వారా పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతలో కొంతైనా ఆ పార్టీలపై వ్యతిరేకత తగ్గిందనే చెప్పవచ్చు. అందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత షర్మిల మరో ప్రజా ప్రస్థానం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్రనే నిదర్సనం.
గతంలో తెలంగాణలో అడుగు పెట్టేందుకే వారు జంకిన సందర్భాలు ఉన్నాయి. మహబూబాబాద్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి రాకను నిరసిస్తూ చోటు చేసుకున్న ఉద్రిక్త సంఘటన అయితేనేమి, గతంలో చంద్రబాబు చేసిన రైతు పోరు యాత్ర అయితేనేమీ.. వారికి తెలంగాణవాదులు అప్పుడు మూడు చెరువుల నీళ్లు తాగించారనే చెప్పవచ్చు. కానీ వ్యతిరేకం కాదనే ఒకే ఒక్క మాట ద్వారా వారు తిరిగి క్రమంగా పుంజుకుంటున్నారు.
దీనిని గుర్తించిన కెసిఆర్ వారికి చెక్ చెప్పే ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు టిడిపి, వైయస్సార్ కాంగ్రెసులు కూడా అఖిల పక్ష సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై తర్జన భర్జన పడుతున్నాయి. ఏం చెబితే ఏమవుతుందో అనే ఆందోళన ఆయా పార్టీల తెలంగాణ ప్రాంత నేతల్లో ఉంది. అదే సమయంలో అధినేతలు ఏమి అభిప్రాయం చెబుతారో అనే భయం మరోవైపు వారిలో కనిపిస్తోంది. చంద్రబాబు తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తూ ప్రధానంగా కెసిఆర్పై విమర్శలు గుప్పిస్తున్నారు.
కాంగ్రెసు పార్టీకి చెందిన ఇరు ప్రాంతాల నేతలు చేతులు దులుపేసుకున్నారు. సీమాంధ్ర నేతలు సమైక్య రాష్ట్రం, తెలంగాణ నేతలు తెలంగాణ అంటున్నారు. సీమాంధ్ర నేతలు అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అంటుండగా..ఇంకొందరు సమైక్యాంధ్రకు జై అంటున్నారు. తెలంగాణ ఎంపీలు తమకు వ్యతిరేకంగా నిర్ణయం ఉంటే సొంత కుంపటి పెట్టేందుకు లేదా ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల్లో మాత్రం ఆందోళన కనిపిస్తోంది. ఎంపీలు ఈ రోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైఖరిపై నిప్పులు చెరిగారు. తెలంగాణవాదులపై కేసులు పెడుతున్నారంటు మండిపడ్డారు.
బిజెపి పార్టీల అధ్యక్షులను రావాల్సిందిగా డిమాండ్ చేస్తోంది. తమ పార్టీ నుండి గడ్కరీ వస్తారని, కాంగ్రెసు నుండి సోనియా వస్తారా అని ప్రశ్నిస్తోంది. అలాగే టిడిపి నుండి చంద్రబాబు రావాలని డిమాండ్ చేస్తోంది. తెరాస కూడా ఇదే తరహా డిమాండ్ ముందుకు తెచ్చింది. తాము అఖిల పక్షంలో స్పష్టమైన వైఖరి చెబుతామని, ఇతర పార్టీలు చెప్పకుంటే బాగుండదని సిపిఐ నారాయణ ఇప్పటికే హెచ్చరించారు.