ఎన్టీఆర్ జనతా స్కీమ్ పునరుద్ధరణ: చంద్రబాబు హామీ

చేనేత కార్మికులకు ఉచిత ఆరోగ్య బీమాను అమలు చేస్తామని, చేనేత రంగంలోని వృద్ధులకు వేయి రూపాయల చొప్పున పింఛను కల్పిస్తామని ఆయన వాగ్దానం చేశారు. చేనేత రంగానికి ఏటా వేయి కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పారు. పట్టు, నూలు, సిల్క్లపై 50 శాతం సబ్సిడీ కల్పిస్తామని హామీ ఇచ్చారు. చేనేత వస్త్రాల విక్రయంపై 30 శాతం రిబేట్ ఇస్తామని ఆయన చెప్పారు. ప్రత్యేకంగా చేనేత కార్పోరేషన్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా చేనేత బజార్లు ఏర్పాటు చేస్తామని, మగ్గాలకు విద్యుత్తు సబ్సిడీ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. చేనేత రంగానికి ఉపాధి హామీని వర్తింపజేస్తామని ఆయన చెప్పారు. చంద్రబాబు శనివారం 1300 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నారు. ఈ సందర్బంగా ఆయనతో కొత్తపల్లి నాయకులు కేక్ కట్ చేయించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావును ప్రాసిక్యూషన్ నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గవర్నర్ చీవాట్లు పెట్టారని ఆయన చెప్పారు. అవినీతిపరుడిని రక్షించాలని ప్రయత్నించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి నిరసనగా ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేయడాన్ని ఆయన ఖండించారు. శాంతియుతంగా ప్రదర్సన నిర్వహిస్తున్న విద్యార్థులపై హింసాత్మక చర్యలకు దిగడం హేయమైన చర్య అని ఆయన అన్నారు. కాగా, చంద్రబాబు భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మావోయిస్టుల నుంచి ఆయనకు ముప్పు ఉందనే సమాచారం అందడంతో ప్రభుత్వం భద్రతా చర్యలపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు.
విద్యుత్తు బిల్లులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారని ఆయన కొత్తపల్లిలో అన్నారు. కరువు వచ్చినా విద్యుత్తు సరఫరాకు అంతరాయం లేకుండా చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన అన్నారు. సర్చార్జీ పేరుతో ప్రజల జేబులను ప్రభుత్వం గుల్ల చేస్తోందని ఆయన విమర్శించారు. మగవారితో సమానంగా మహిళలను తీర్చిదిద్దిన ఘనత కూడా తమకే దక్కుతుందని ఆయన చెప్పుకున్నారు.












Click it and Unblock the Notifications