ఢిల్లీ రేప్: ఆమె చిన్నప్రేవు తీశారు, మిత్రుడు కలిశాడు
ఆమెకు అసలు చిన్న పేగులన్నవే దాదాపు లేకపోవడంతో.. కేవలం టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ (టీపీఎన్) మీదే పూర్తిగా ఆధారపడాల్సి వస్తుందని, దీన్ని సాధారణంగా ఒక పెద్ద రక్తనాళం ద్వారా పంపుతామని ఎయిమ్స్ ట్రామా సెంటర్ చీఫ్ డాక్టర్ ఎంసీ మిశ్రా తెలిపారు. కొన్నేళ్ల పాటు ఆమె నోటి ద్వారా ఆహారం తీసుకోవడం కష్టమని సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ కేటీ భౌమిక్ తెలిపారు. ఇప్పటికే బాధితురాలి కాలేయం సరిగా పనిచేయడంలేదు.
కొన్ని నెలల తర్వాత ఆమె నోటి ద్వారా ఆహారం తీసుకోవచ్చు గానీ, అది కేవలం సంతృప్తి కోసమేనని, ఆమె తీసుకున్న ఆహారం వెనువెంటనే బయటకు వెళ్లిపోతుందని మేదాంత మెడిసిటీ ఆస్పత్రిలోని అవయవ మార్పిడి నిపుణుడు డాక్టర్ ఏఎస్ సోనీ వివరించారు. బాధితురాలికి పేగుమార్పిడి శస్త్రచికిత్స చేసేందుకు తాము సిద్ధమని న్యూఢిల్లీలోని గంగారాం ఆస్పత్రి వైద్యులు ముందుకొచ్చారు. కానీ, ఇంతవరకు ఇలాంటి శస్త్రచికిత్స మన దేశంలో విజయవంతం కాలేదు. యూకేలోను, టొరంటోలోను మాత్రమే జరిగాయి. అయినా, కనీసం ఆరు నెలలు లేదా ఏడాది తర్వాత మాత్రమే ఇలాంటి ఆలోచన చేయగలమని డాక్టర్ భౌమిక్ తెలిపారు.
మూత్రపిండాలు, కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు 90 శాతం విజయవంతం అయ్యే అవకాశం ఉండగా, విదేశాల్లో కూడా పేగుమార్పిడి చికిత్సలు మాత్రం 30-40 శాతమే విజయవంతం అవుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆమెను ఐసీయూ నుంచి బయటకు తీసుకురావడానికే తాము ప్రయత్నిస్తున్నామని, అలా వస్తే ఇన్ఫెక్షన్లు చాలావరకు తగ్గుతాయని డాక్టర్ భౌమిక్ తెలిపారు. ఆమె కోలుకోడానికి రాబోయే 7-10 రోజులు చాలా కీలక సమయమని, కొన్ని నెలల తర్వాతే మిగిలిన శస్త్రచికిత్సలు చేస్తామని చెప్పారు.
సజీవ దాత ఇచ్చిన పేగులను వేరే వారికి అమర్చే శస్త్రచికిత్సను తమ ఆస్పత్రిలో విజయవంతంగా చేశామని, అందువల్ల అత్యాచార బాధితురాలికి కూడా ఈ శస్త్రచికిత్స పూర్తి ఉచితంగా చేస్తామని గంగారాం ఆస్పత్రి చైర్మన్ డీఎస్ రాణా ముందుకొచ్చారు. ఇలాంటి కేసుల్లో పేగుమార్పిడి మాత్రమే పనికొస్తుందని ఆస్పత్రిలో అవయవ మార్పిడి నిపుణుడు, జీర్ణాశయ శస్త్రచికిత్స విభాగాధిపతి డాక్టర్ సమీరన్ నంది తెలిపారు. ఆరోగ్యవంతుల శరీరంలో నుంచి 2 మీటర్ల వరకు పేగులను తీసినా వారికి ఇబ్బంది ఉండదని, అదే బ్రెయిన్ డెడ్ వారికైతే మొత్తం పేగులను తీసి మార్చచ్చని డాక్టర్ మెహతా చెప్పారు.
బాధితురాలికి స్నేహితుడు పరామర్శ
బాధితురాలి స్నేహితుడు గురువారం రాత్రి 9 గంటల సమయంలో వచ్చి తన సోదరిని పరామర్శించాడని, అప్పుడామె అతడిని నిందితుల గురించే అడిగిందని బాధితురాలి సోదరుడు మీడియాకు తెలిపాడు. స్పృహ వచ్చినప్పుడల్లా అతడెలా ఉన్నాడనే ఆమె అడిగేదని చెప్పాడు. నోట్లో ఒక గొట్టం ఉండటంతో ఏమీ మాట్లాడలేక సైగల ద్వారా వైద్యులకు, తమ తల్లిదండ్రులకు విషయం చెబుతోందని, పోలీసులు అడిగనప్పుడు కూడా కాగితం మీదే ఏదో రాసినట్లు తన తల్లి చెప్పిందని తెలిపాడు.