వెంటిలెటర్పై గ్యాంగ్రేప్ విక్టిం: పోలీస్పై రాళ్లు, లాఠీఛార్జ్
న్యూఢిల్లీ: వారం రోజుల క్రితం జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన వేడి దేశ రాజధానిలో ఇంకా చల్లారలేదు. పెద్ద ఎత్తున ఆందోళనకారులు ఇండియా గేట్ వద్దకు తరలి వచ్చారు. నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళనకారులు రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు.
పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీసులు వాటర్ క్యానన్లు, బాష్పవాయువును ప్రయోగించారు. లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.
ఆందోళనకారులపై లాఠీఛార్జ్ని నిరసిస్తూ జంతర్ మంతర్ వద్ద మరికొంతమంది ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని కూడా అక్కడి నుండి చెదరగొట్టారు. ఢిల్లీలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. ఆందోళనకారులకు బాబా రామ్ దేవ్ మద్దతు పలికారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇటలీ మహిళ కాబట్టి ఆమెకు భారత దేశ మహిళల ఇబ్బందులు అర్థం కావడం లేదని హైదరాబాదులో టిడిపి నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మండిపడ్డారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పరిస్థితిని సమీక్షించారు. ఆందోళనకారులు శాంతియుతంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. లోకసభ ప్రధాన ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ కూడా ఆందోళనకారులు హింసకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.
ఆందోళనకరంగా బాధితురాలు
గ్యాంగ్ రేప్కు గురైన బాధితురాలి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆమె శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతోంది. దీంతో సఫ్దర్ జంగ్ ఆసుపత్రి వైద్యులు ఆమెను తిరిగి వెంటి లెటర్ పైన ఉంచారు.