న్యాయం అడిగితే లాఠీఛార్జ్: గ్యాంగ్ రేప్పై నారా లోకేష్
మనం ఎలాంటి ప్రజాస్వామ్య దేశంలో జీవిస్తున్నాం.. సామూహిక అత్యాచారానికి గురైన అమ్మాయికి న్యాయం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తుంటే వారిపై పోలీసులు వాటర్ క్యానన్లు, బాష్పవాయు గోళాలు ప్రయోగించడం, లాఠీఛార్జ్ చేస్తున్నారంటూ విమర్శించారు. కాగా గ్యాంగ్ రేప్ నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఆర్పిఎన్ సింగ్ అన్నారు. ఆందోళనకారుల సూచనలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. వారి సంయమనం పాటించాలని కోరారు.
కాగా పార్లమెంటును తక్షణం సమావేశపరచడం, రేపిస్టులకు బహిరంగ ఉరి అనే డిమాండ్లపై స్పందించకుండా ఇతరత్రా చర్యలను కేంద్రం శనివారం ప్రకటించింది. రాష్ట్రపతి భవన్ ముట్టడి నేపథ్యంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ను శనివారం సాయంత్రం హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే కలిశారు. పరిస్థితిని వివరించారు. అటు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా... ప్రధానితో ఫోన్లో మాట్లాడారు.
అత్యాచారాలను అరికట్టాలని, మహిళలకు భద్రత కల్పించేందుకు తక్షణం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. తర్వాత... షిండే ఆందోళనకారులను సంతృప్తి పరిచేలా కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. సామూహిక అత్యాచార ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తామని తెలిపారు. మహిళల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని... అరుదైన కేసుల్లో రేపిస్టులకు గరిష్ఠంగా మరణ శిక్ష విధించేలా చట్టం మారుస్తామని సంకేతాలు పంపారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తించిన పోలీసులను సస్పెండ్ చేశారు. బిజెపి నేత సుష్మాస్వరాజ్ కోరినట్లు పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయలేమని షిండే స్పష్టం చేశారు. ఇక శాంతించండి అని నిరసనకారులను కోరారు. బస్సు యజమానులపైనా చర్యలు తీసుకుంటామని, దర్యాప్తు వేగంగా జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రజారవాణా వాహనాల్లో జిపిఎస్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. బాధితురాలికి అత్యుత్తమ చికిత్స అందచేస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు అత్యాచారాలపై గళమెత్తిన యువతకు విదేశీ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్ చురకలు అంటించారు. అత్యాచార, ఉగ్రవాద కేసుల్లో శీఘ్ర విచారణ జరగాలంటూనే... ఆ విచారణ వీధుల్లో జరపలేమన్నారు. అది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని తెలిపారు.