షిండే రెడీ, జగన్ ద్రోహి, బాబు బాగు: తెలంగాణ ఎంపిలు
తెలంగాణపై అఖిల పక్ష సమావేశం నిర్మాణాత్మక పద్ధతిలో జరిగిందని మందా జగన్నాథం అన్నారు. నెల రోజుల్లో తెలంగాణపై నిర్ణయం వెల్లడిస్తామనే షిండే ప్రటనను తాము ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. 2009 డిసెంబర్ 9వ తేదీననే కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించిందని, అయితే కాంగ్రెసేతర పార్టీలు వెనక్కిపోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ఆగిపోయిందని ఆయన అన్నారు. కాంగ్రెసు తెలంగాణపై స్పష్టమైన వైఖరితో ఉందని చెప్పడానికి ఈ సమావేశం నిదర్శనమని ఆయన అన్నారు. నెల రోజుల లోపలే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం రావచ్చునని ఆయన అన్నారు.
విభజనకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పిన తర్వాత ఇతర పార్టీలు తెలంగాణపై అభిప్రాయాలను అఖిల పక్ష సమావేశంలో వెల్లడించాయని వివేక్ అన్నారు. తెలంగాణ తెచ్చుకోవడం తమందరి బాధ్యత అని ఆయన అన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచి తెలంగాణ సాధించుకుందామని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పడి తీరుతుందని మధు యాష్కీ అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ గతంలో పార్లమెంటులో ప్లకార్డు ప్రదర్శించారని, ఇప్పుడు అఖిల పక్ష సమావేశంలో స్పష్టమైన వైఖరి చెప్పకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తన అసలు రంగు బయట పెట్టుకుందని ఆయన అన్నారు.
వైయస్ జగన్ తెలంగాణ ద్రోహి అని, ఆ పార్టీలో ఉండేవారు తెలంగాణ వ్యతిరేకులుగా ముద్ర వేయించుకుంటారని, వైయస్సార్ కాంగ్రెసు నుంచి తెలంగాణ నాయకులు బయటకు రావాలని మధు యాష్కీ అన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెప్పడం తెలంగాణను వ్యతిరేకించడమేనని ఆయన అన్నారు. తాము 2008లో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని తెలుగుదేశం చెప్పడాన్ని తాము ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు. అయితే, కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత తెలంగాణను అడ్డుకునేందుకు మరోసారి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేయకూడదని ఆయన సూచించారు. తెర వెనక చిరంజీవిలాంటివాళ్లతో మాట్లాడుకుని తెలంగాణపై మాట మారిస్తే చంద్రబాబు తెలంగాణలో మిగలకుండా పోతారని ఆయన హెచ్చరించారు.
నెల రోజుల్లో నిర్ణయం వెలువరిస్తామని హోం మంత్రి చెప్పిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు బంద్కు పిలుపునివ్వడం సరి కాదని మధు యాష్కీ అన్నారు. తెలంగాణపై తేల్చని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మీద అందరం కలిసి దండయాత్ర చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మనమంతా కలిసి పోరాటం చేద్దామని ఆయన కెసిఆర్కు సూచించారు. బంద్ చేస్తే సీమాంధ్ర రాజకీయ పెట్టుబడిదారులు కుట్ర చేస్తారని ఆయన అన్నారు.
విభజనకు కాంగ్రెసు పార్టీ విభజనకు సిద్ధంగా ఉందని రాజయ్య అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రమే సందిగ్ధంలో ఉందని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని అడ్డుకోవాలని ఆయన సూచించారు. తమ పార్టీ చెప్పిన తర్వాతనే తాము 2008తేదీ లేఖకు కట్టుబడి ఉన్నామని తెలుగుదేశం పార్టీ అఖిల పక్ష సమావేశంలో చెప్పిందని పొన్నం ప్రభాకర్ అన్నారు. చంద్రబాబు ఆడిన మాట తప్పినందుకు విశ్వాసాన్ని కోల్పోయారని, తిరిగి ఆ విశ్వాసాన్ని పొందడానికి ఇప్పుడు అనుకూలంగా నిర్ణయం చెప్పారని ఆయన అన్నారు.
వైయస్ జగన్పై పొన్నం ప్రభాకర్ విరుచుకుపడ్డారు. తాను తెలంగాణ వ్యతిరేకినని జగన్ మరోసారి నిరూపించుకున్నారని ఆయన విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో నియంతృత్వం ఉదని, ప్రజాస్వామ్యం లేదని ఆయన అన్ారు. జగన్ తెలంగాణ ద్రోహి అని ఆయన విమర్శించారు. ఇతర ప్రాంతాలకు తాము వ్యతిరేకం కాదని, విడిపోయి అభివృద్ధి చెందుదామని, తెలంగాణను వ్యతిరేకించే పని చేయవద్దని ఆయన సీమాంధ్ర నాయకులను కోరారు. కెసిఆర్ బందు పిలుపును ఉపసంహరించుకోవాలని ఆయన కోరారు.