తెలంగాణపై మాటతో గుండెల్లో రైళ్లు: కెసిఆర్పై బాబు

తెలంగాణకు మద్దతు తాము 2008లో చేసిన తీర్మానానికి మెచ్చి తెరాస తమతో పొత్తు పెట్టుకుందని, 45 సీట్లు ఇస్తే పది సీట్లు మాత్రమే గెలుచుకుందని ఆయన అన్నారు. ఎన్నికలు వస్తున్నాయని తమ పార్టీపై కెసిఆర్ ఆభాండాలు వేస్తున్నారని ఆయన విమర్శించారు. తాము ప్రజల మనోభావాలను గౌరవిస్తామని, ప్రజల్లో ఉంటామని ఆయన చెప్పారు. తెలంగాణను అభివృద్ధి చేసే పార్టీ టిడిపి మాత్రమేనని ఆయన అన్నారు. తమను కెసిఆర్ లాంటి వ్యక్తి ఏమీ చేయలేడని ఆయన అన్నారు.
కాంగ్రెసు పార్టీలో భాగస్వామిగా ఉన్నప్పుడు కెసిఆర్ ఏం చేశాడని ఆయన అడిగారు. కేంద్ర కార్మిక మంత్రిగా ఉండి బీడీ కట్టలపై పుర్రె గుర్తు పెట్టించి బీడీ కార్మికులకు అన్యాయం చేశారని ఆయన విమర్శించారు. తెలంగాణ ప్రజల కష్టాలను తీర్చే పార్టీ తెలుగుదేశం మాత్రమేనని ఆయన అన్నారు. అధికారం వస్తే డబ్బులు వసూలు చేసుకుని, అవినీతికి పాల్పడడమే పనిగా కొన్ని పార్టీలు పనిచేస్తున్నాయని ఆయన అన్నారు. తెరాస బ్లాక్మెయిల్ చేస్తోంది తప్ప చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని ఆయన అన్నారు. ఎవరు మీతో ఉన్నారో, ఎవరు మోసం చేస్తున్నారో ఆలోచించుకోవాలని ఆయన ప్రజలను కోరారు.
తెలంగాణకు తమ పార్టీ వ్యతిరేకం కాదని, తెలంగాణపై తమ పార్టీ మాట మీద కట్టుబడి ఉందని, ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికే తాను ప్రయత్నిస్తానని ఆయన అన్నారు. తెరాసకు ప్రజా సమస్యలు పట్టవని, ప్రజలకు అండగా నిలిచే పార్టీ తమది మాత్రమేనని ఆయన అన్నారు. కెసిఆర్ ఆరు నెలలు ఫామ్హౌస్లో పడి ఉంటాడని, కుంభకర్ణుడి నిద్రపోతాడని, ఎప్పుడో వచ్చి మాయమాటలు చెబుతాడని, ఆ మాయమాటలను ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు. మాటల గారడీతో ఒరిగేది ఏమీ ఉండదని, కెసిఆర్ మన జీవితాలను నాశనం చేస్తాడని అన్నారు.
ఎప్పుడు ప్రజల్లో ఉండే తెలుగుదేశం పార్టీని చూస్తే కెసిఆర్కు భయమని చంద్రబాబు అన్నారు. పిరికితనంతో తమపై విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు అవినీతి పార్టీ అని, కాంగ్రెసు కూడా అవినీతికి నిలయమని వ్యాఖ్యానించారు. కరీంనగర్ జిల్లాకు ఆయన హామీల వర్షం కురిపించారు.












Click it and Unblock the Notifications