తగులబెడితే ఇవ్వాలా: కావూరి, సీమాంధ్రలో బంద్
తెలంగాణ సమస్యకు సామరస్య, శాశ్వత పరిష్కారం చూపాలని లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాన రాజకీయ పార్టీలే పచ్చని రాష్ట్రంలో చిచ్చుపెట్టాయని.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేశాయని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, ప్రజల ప్రయోజనాలను పరిరక్షిస్తూ రాష్ట్ర విభజన అంశాన్ని తేల్చాల్సి ఉందన్నారు.
అఖిలపక్ష సమావేశాన్ని నిరసిస్తూ శుక్రవారం సీమాంధ్ర విద్యాసంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ మండూరి వెంకటరమణ తెలిపారు. గురువారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జిల్లా విద్యార్థి, ఉద్యోగుల జేఏసీ సమావేశం జరిగింది. అఖిలపక్ష సమావేశాన్ని వ్యతిరేకిస్తూ 13జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో బంద్ చేపడతామన్నారు. విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే రాజకీయ పార్టీల అడ్రస్ గల్లంతవుతుందన్నారు.
అఖిలపక్ష సమావేశంలో పార్టీల వైఖరి స్పష్టంగా ఉంటుందని విశ్వసిస్తున్నట్లు పంచాయతీరాజ్ మంత్రి జానారెడ్డి తెలిపారు. ఈ చర్చల తర్వాత తెలంగాణ అంశానికి పరిష్కార మార్గం మొదలవుతుందని ఆశిస్తున్నానని ఆయన గురువారం హైదరాబాద్లో అన్నారు. సమావేశంలో కాంగ్రెస్ కూడా స్పష్టత ఇస్తుందని అభిప్రాయపడ్డారు. సచివాలయంలోని జానారెడ్డి ఛాంబర్కు గురువారం పీసీసీ చీఫ్ బొత్స వచ్చారు.
గంట పాటు జరిగిన ఈ భేటీలో మంత్రి బస్వరాజు సారయ్య కూడా పాల్గొన్నారు. అంతకు ముందే అక్కడున్న మరో మంత్రి గంటా శ్రీనివాస రావు భేటీ ప్రారంభమైన పది నిమిషాలకే వెళ్లిపోయారు. అఖిలపక్షంలో పార్టీల స్పందనలు దృష్టిలో పెట్టుకుని తమ విజ్ఞప్తులను కేంద్రానికి, అధిష్ఠానానికి వినిపించేందుకు సమయం తీసుకుంటామని భేటీ తర్వాత బొత్స చెప్పారు.