తెలంగాణకు బాబు ఒకే: లేఖ సంక్షిప్తంగా.., 2008 లేఖ
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ తెలంగాణకు ఒకే చెప్పేసింది! తాము తెలంగాణకు అనుకూలంగా ఉన్న సంకేతాలని అఖిల పక్ష సమావేశం ద్వారా ఇచ్చింది. శుక్రవారం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో ఆయా పార్టీలు తమ అభిప్రాయాన్ని చెప్పాయి. తెలుగుదేశం పార్టీ సీల్డ్ కవర్లో తమ పార్టీ అభిప్రాయాన్ని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేకు అందించింది. సమావేశం తర్వాత లేఖను మీడియాకు అందజేసింది. లేఖలో సంక్షిప్తంగా....
తాము 2008లోనే నాటి కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీకి తెలంగాణపై లేఖ ఇచ్చామని, తాము ప్రత్యేక రాష్ట్రానికి అనుకూలంగా ఉన్నట్లు అప్పుడు లేఖలో పేర్కొన్నామని, దానిని ఇప్పటి వరకు వెనక్కి తీసుకోలేదని, ఇప్పటికీ తాము దానికే కట్టుబడి ఉన్నామని తెలిపింది. మీడియా సమావేశంలో కూడా యనమల, కడియం శ్రీహరిలు అదే చెప్పారు. టిడిపి నిర్ణయాన్ని కేవలం తెలంగాణ కారణంతో బయటకు వెళ్లిన నాగం జనార్ధన్ రెడ్డి స్వాగతించారు.
గతంలో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని చెప్పిన నేపథ్యంలో 2008లో టిడిపి ప్రణబ్కు రాసిన లేఖ పూర్తి పాఠం....

గతంలో రాసిన లేఖలో తెలంగాణ అంశంపై మా అభిప్రాయాలు తెలిపాం. ఇప్పుడు తెలంగాణ ప్రజల సెంటిమెంట్, భావోద్వేగాలను, తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకొని మా పార్టీ ఒక కోర్ కమిటీని నియమించింది. సీనియర్ నాయకులతో వేసిన ఆ కోర్ కమిటీ అందరి అభిప్రాయాలు తీసుకుంది. ఆ కమిటీ పార్టీకి తన నివేదిక సమర్పించింది. పార్టీ పోలిట్ బ్యూరో సమావేశమై ఆ నివేదికపై కూలంకషంగా చర్చించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా సిఫార్సు చేస్తూ కోర్ కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించింది. పోలిట్ బ్యూరో తీర్మానం ప్రతిని కూడా జతపరుస్తున్నాం.
పోలిట్ బ్యూరో తీర్మానం
తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల ప్రజాభీష్టం మేరకు నాయకులు అంగీకారంతో 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. తదనంతర పరిణామాలతో తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే కోరిక తెలంగాణ ప్రజల మనసుల్లో ఏర్పడి పలుసార్లు, పలు విధాలుగా వ్యక్తమయింది. ఈ క్రమంలో ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాలు జరిగాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వికాసానికి, ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సమైక్యవాదమే దోహదపడుతుందని తెలుగుదేశం పార్టీ అభిప్రాయపడింది. ఇందులో భాగంగా టిడిపి ప్రభుత్వాలు తెలంగాణతో పాటు ఇతర వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి పలు ఆర్థిక, సామాజిక, రాజకీయపరమైన చర్యలు చేపట్టాయి.
రాష్ట్ర రాజకీయాల పరిణామాలనునిరంతరం నిశితంగా సమీక్షించే తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల మనోభావాలను గమనించి మొదటి నుంచీ గౌరవిస్తూనే వచ్చింది. ప్రజల మనోభావం బలపడడాన్ని గుర్తించి రెండేళ్ల క్రితమే తెలంగాణ అంశంపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని తెదేపా ప్రకటించింది. అనంతరం తెలంగాణ అంశంపై విస్తృతంగా చర్చ జరగాలని నిర్ణయించింది. అయితే ఇది సున్నితమైన అంశం కాబట్టి అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను అధ్యయనం చేసే ఉద్దేశ్యంతో పార్టీ సీనియర్ నేతలతో కోర్ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ కమిటీ గత ఐదు నెలలుగా విస్తృత స్థాయిలో అభిప్రాయ సేకరణ జరిపి, ప్రజాభిప్రాయం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ఉందని పొలిట్ బ్యూరోకి తెలిపింది. కోర్ కమిటీ అభిప్రాయంపై కూలంకషంగా చర్చించిన పార్టీ పొలిట్ బ్యూరో తెలంగాణ ప్రజల మనోభావాలని గౌరవిస్తూ, వారి అభీష్టం మేరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయించింది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి దృష్టి కేంద్రీకరించింది.
ఈ దిశలో నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది. తెలుగువారి ఆత్మగౌరవ పరిరక్షణ, వారి సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంతో నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తెలుగువారు ఏ ప్రాంతంలో నివసించినా అందరికీ సమన్యాయం జరిగేలా కృషి చేస్తుంది. - ఇది 2008 అక్టోబరు రెండో వారంలో టిడిపి పొలిట్ బ్యూరో చేసిన తీర్మానం. ఈ తీర్మాన్నే చంద్రబాబు తన లేఖతో జత చేశారు.












Click it and Unblock the Notifications