మళ్లీ తడబాటు: తెలంగాణకు టార్గెట్గా మారిన 'జగన్'
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రం ఏమీ చెప్పకుండా కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించింది. ఇటీవల అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అంశంపై తడబడిన జగన్ పార్టీ మరోసారి తడబడింది. అఖిల పక్ష సమావేశంలో ఏం చెప్పక పోవడంతో మిగిలిన పార్టీల కంటే తెలంగాణవాదులకు ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే టార్గెట్గా మారినట్లుగా కనిపిస్తోంది. తెలంగాణవాదులు, నేతలు టిడిపి నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా, జగన్ పార్టీ వైఖరిని తప్పు పడుతున్నారు.
ఓయు జెఏసి నిప్పులు
శనివారం నాటి తెలంగాణ రాజకీయ ఐక్యా కార్యాచరణ సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి బందుకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి జెఏసి ప్రకటించింది. రేపు విద్యాసంస్థలు అన్నీ బందులో పాల్గొనాలని పిలుపునిచ్చాయి. కాకతీయ విశ్వవిద్యాలయ జెఏసి కూడా మద్దతు ప్రకటించింది. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైఖరిని నిరసిస్తూ ఎల్లుండి చలో హైదరాబాద్ కార్యాక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపింది.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాటకం బహిర్గతం అయిందని, ఆ పార్టీ జెండా పట్టుకున్న వారిని తెలంగాణ ద్రోహులుగానే గుర్తిస్తామని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు ప్రకటించారు. మూడేళ్ల క్రితం పార్లమెంటులో టిడిపి ప్రజాప్రతినిధుల చేతుల్లో నుండి సమైక్యాంధ్ర ప్లకార్డు లాక్కొని జగన్ ప్రదర్శించారు. అప్పటి నుండి ఆయనను తెలంగాణ వ్యతిరేకంగా తెలంగాణవాదులు భావిస్తున్నారు. ఇప్పుడు అఖిల పక్షంలో ఏం చెప్పకపోవడంతో జగన్ ప్రధానంగా మరోసారి టార్గెట్ అయ్యారు. కాంగ్రెసు పార్టీ అధికారంలో ఉంది కాబట్టి దానిని ఎలాగూ ప్రశ్నిస్తారు. టిడిపి పట్ల కొంత సానుకూలత కనిపిస్తోంది. అదే సమయంలో సీమాంధ్రలో టిడిపిపై వ్యతిరేకత వస్తోంది.
కాగా రేపటి తెలంగాణ బందుకు ఫిలిం చాంబర్, తెలంగాణ ప్రభుత్వాసుపత్రుల వైద్యుల సంఘం, ఓయు, కెయు ఐక్య కార్యాచరణ సమితిలు మద్దతు ప్రకటించాయి.