చంద్రబాబు తెలంగాణపై పరిధి దాటారు: నారాయణ
తెలంగాణపై చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతించాల్సిందేనని ఆయన అన్నారు. అన్ని పార్టీలు తాము అనుకున్నట్లు తెగించి ముందుకు వస్తాయని తాను అనుకోవడం లేదని ఆయన అన్నారు. సిపిఐ, తెరాసలకు ఉన్నంత స్పష్టత మిగతా పార్టీలకు తెలంగాణపై ఉంటుందని అనుకోవడం లేదని ఆయన అన్నారు. ఉన్నంతలో తెలుగుదేశం పార్టీ వైఖరి బాగానే ఉందని ఆయన అన్నారు.
తెలంగాణపై ఇచ్చిన మాటను వెనక్కి తీసుకుంటే ప్రజలు గుణపాఠం చెప్తారని ఆయన అన్నారు. తెలంగాణపై అఖిల పక్ష సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరిందని, కాంగ్రెసు పార్టీ మాత్రమే ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆయన అన్నారు. చంద్రబాబు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు - ఇద్దరూ తనకు మిత్రులేనని ఆయన అన్నారు. చంద్రబాబుతో దోస్తీ కట్టే విషయంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నారాయణ చెప్పారు.
తెలంగాణపై 30 రోజుల్లో ప్రకటన వస్తుందనే ఆశతో తాము ఉన్నామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె. జానా రెడ్డి అన్నారు. కాంగ్రెసు వైఖరి ఎలా ఉన్నా తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ముఖ్యమని ఆయన శనివారంనాడు మీడియాతో అన్నారు. తెలంగాణపై సానుకూల ప్రకటన వస్తుందని తాము ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై నెల రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటామనే కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చేసిన ప్రకటనను తెరాస అధ్యక్షుడు కెసిఆర్ నమ్మలేదని, అందుకే బంద్కు పిలుపునిచ్చారని ఆయన అన్నారు.
సీమాంధ్ర ప్రజలు కూడా రాష్ట్ర విభజనను కోరుకుంటున్నారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తమ పార్టీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివ రావు, లగడపాటి రాజగోపాల్ మాత్రమే తెలంగాణను వ్యతిరేకిస్తూ సీమాంధ్ర విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ఆయన శనివారం నల్లగొండలో అన్నారు. తెలంగాణ ఇవ్వకుంటే తాము తమ దారి తాము చూసుకుంటామని తెలంగాణ ఎంపీలందరూ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి తెలిపినట్లు ఆయన చెప్పారు కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి కూాడ తెలంగాణ ఇవ్వకుంటే తన పదవికి రాజీనామా చేస్తారని, అయితే కాంగ్రెసులోనే కొనసాగుతారని ఆయన అన్నారు
తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మినారాయణ చెప్పారు. తెలంగాణ సమస్య పరిష్కారం కావాలని తాము కోరుకుంటున్నట్లు ఆయన శనివారం తెలిపారు.