తెలంగాణ వైఖరి: చంద్రబాబుకు సీమాంధ్ర సెగ
ఈ సందర్బంగా జగదీష్ మాట్లాడారు. తెలుగు ప్రజల ముద్దు బిడ్డ ఎన్టిఆర్ కడదాక ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండాలని కోరుకున్నారని అన్నారు. ఎన్టీఆర్ వారసుడనని చెప్పుకుంటున్న చంద్రబాబు మాత్రం తెలుగు వారికి ద్రోహం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తొమ్మిదేళ్ళ పాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసింది ఆంధ్రప్రదేశ్కేనని తెలగాణకు కాదన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఒంగోలుతో పాటు చీరాల, అద్దంకి, మార్కాపురం తదితర పట్టణాల్లోను విద్యార్థుల ఆందోళనలు జరిగాయి.
తెలుగుదేశం నాయకులను, తెలుగుదేశం పార్టీని సీమాంధ్ర నుంచి వెలివేయాలని సమైక్యాంధ్ర నాయకులు అడుసుమల్లి జయ ప్రకాష్ పిలుపు నిచ్చారు. విజయవాడలోని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 1982లో విజయవాడలో జరిగిన సమావేశంలో తెలుగు దేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తెలుగుజాతికి కొత్త జీవం తేవడానికి పార్టీ పుట్టిందని చెప్పిన సంగతిని మరిచి ఇప్పటి తెలుగుదేశం నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని విమర్శించారు.
2005 నుంచి తెలంగాణ విషయంలో రోజుకొక మాట మాట్లాడారన్నారు. న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో తెలుగుదేశం నాయకులు అనుసరించిన వైఖరి చాలా దౌర్భాగ్యంగా ఉందన్నారు. అంతటి నీచాన్ని ఎక్కడా చూడలేదని చెప్పారు. వారు అనుసరించి వైఖరిని సీమాంధ్రలో ఆ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రాష్ట్రాన్ని విభిజస్తే అగ్నిగుండమవుతుందని అన్నారు. బంద్లు, ఆందోళనలు, దీక్షలు చేసిన తెలుగు దేశం నాయకులు శుక్రవారం ఢిల్లీలో జరిగిన పరిణామాలపై ఏం సమాధానం చెబుతారు, ఏం ముఖం పెట్టుకుని తిరుగుతారు? అని ప్రశ్నించారు.
తెలుగుదేశంపార్టీకి తగిన గుణ పాఠం చెప్పాలని, వారిని ఇక్కడి నుంచి తక్షణమేబహిష్కరించాలని కోరారు. మరోవైపు ప్రధాని మన్మోహన్ గాని, పార్లమెంట్లో హోమ్ మంత్రి షిండేగాని చెప్పిన మేరకు ఏకాభిప్రాయం లేనిదే రాష్ట్రాన్ని విభజించే ఆలోచనకు పూనుకోకూడదని చెప్పారు. ఇందుకు భిన్నంగా ఏ నిర్ణయం తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఏదైనా విభజన చేయదలిస్తే జాతీయ, శాస్త్రీయ విధానాల మేరకే చేయాలన్నారు.