ఢిల్లీ గ్యాంగ్ రేప్: షీలా దీక్షిత్కు చేదు అనుభవం
భద్రతాధికారులతో పాటు జంతర్ మంతర్ వద్దకు వచ్చిన షీలా దీక్షిత్ను చూసి యువకులు, యువతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షీలా దీక్షిత్ వాపస్ జావో అంటూ నినదించారు. గ్యాంగ్ రేప్ బాధితురాలి స్మారకంగా కొవ్వొత్తులు వెలిగించాలని షీలా దీక్షిత్ అనుకున్నారు. అయితే, యువతీయువకుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఓ చెట్టు కింద హడావిడిగా కొవ్వొత్తి వెలిగించి, తల వంచి మౌనం పాటించి వెంటనే వెళ్లిపోయారు.
గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతికి పెద్ద యెత్తున ప్రజలు మౌనంగా సంతాపం వ్యక్తం చేశారు. దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతి తనకు సిగ్గుచేటైన విషయమని షీలా దీక్షిత్ శనివారం ఉదయం అన్నారు. తన గుండె కుతకుత ఉడికిపోతోందని ఆమె అన్నారు.
ఢిల్లీ గ్యాంగ్ రేప్ దోషులకు కఠినమైన శిక్ష పడేలా చూస్తామని యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీ హామీ ఇచ్చారు. బాధితురాలి ధైర్యం, స్ఫూర్తి ఎప్పటికీ నిలిచే ఉంటుందని ఆమె ఓ టెలివిజన్ ద్వారా మాట్లాడుతూ అన్నారు. తల్లిగా, మహిళగా ఆందోళనకారుల భావోద్వేగాలను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. ప్రశాంతంగా ఉండాలని ఆమె వారిని కోరారు.
కాగా, గ్యాంగ్ రేప్ నిందితులపై పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. నిందితులను తీహార్ జైలులో ఉంచారు. ఆరుగురు నిందితుల్లో ఒకతను మైనర్. దీంతో అతన్ని జువనైల్ హోమ్కు పంపించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాంసింగ్ బస్సు డ్రైవర్. ఐదుగురు నిందితులకు కూడా తీహార్ జైలులో భద్రతను కట్టుదిట్టం చేశారు. వారిపై ఇతర ఖైదీలు దాడి చేస్తారనే అనుమానంతో భద్రతను కట్టుదిట్టం చేశారు.