గ్యాంగ్ రేప్ విక్టిం మృతి: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత
న్యూఢిల్లీ: పదిహేను రోజుల క్రితం బస్సులో గ్యాంగ్ రేప్కు గురై మృతి చెందిన ఇరవై మూడేళ్ల యువతికి సంతాపంగా నిరసన ప్రదర్శనలు చేపట్టేందుకు పెద్ద ఎత్తున విద్యార్థులు, మహిళా సంఘాలు జంతర్ మంతర్ వద్దకు ఆదివారం చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ కొద్దిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. అత్యాచార ఘటనల్లో చట్టాలని కఠినతరం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దోషులకు కఠిన శిక్షలు అముల చేయాలని వారు నినదించారు. విద్యార్థులు ఇండియా గేట్ వద్దకు రాకుండా పోలీసులు బారీకేడ్లను ఏర్పాటు చేశారు. నిరసనకారులు బారీకేట్లను తొలగించుకుంటూ ఇండియా గేట్ వద్దకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. మహిళా సంఘాలు పెద్ద ఎత్తున శాంతి ర్యాలీని నిర్వహించాయి.
అత్యాచారానికి పాల్పడ్డ ఆరుగురు నిందితులకు ఉరి శిక్ష విధించాలని వారు డిమాండ్ చేశారు. ఇలాంటి కేసులను త్వరితగతిన విచారించాలన్నారు. కాగా ఈ రోజు ఐదు మెట్రో స్టేషన్లను పునరుద్దరించారు. మరోవైపు అత్యాచారానికి గురైన బాధితురాలి అంత్యక్రియలు ఆదివారం ఉదయం పూర్తయిన విషయం తెలిసిందే. అనంతరం వారణాసిలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.