తెలంగాణే సమస్య, బాబుతో విభేదాల్లేవు: మోదుగుల
గుంటూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పడితే ఆంధ్రా ప్రాంతం ఎడారి అయిపోతుందనేదే తన బాధ అని చెప్పారు. ఇప్పటికే పదేళ్లలో కర్ణాటక ఎన్నో ప్రాజెక్టులు కట్టి 300 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని పెంచుకొందన్నారు. దాని ప్రభావం ఈ ఏడాది స్పష్టంగా కనిపించిందన్నారు.
కాగా తెలంగాణకు అనుకూలంగా పార్టీ నిర్ణయం తీసుకోవడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని నర్సారావుపేట తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి శనివారం అన్న విషయం తెలిసిందే. తాను సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నానని చెప్పారు. రెండు మూడు రోజుల్లో పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో సమైక్యవాదంపై మాట్లాడుతానని చెప్పారు.
తమ ప్రాంత ప్రజల మనోభావాలను ఆయనకు తెలియజేస్తానన్నారు. ఆయనతో మాట్లాడిన తర్వాత నిర్ణయిస్తానన్నారు. పార్లమెంటులో సమైక్యవాదం వినిపిస్తానని చెప్పారు. కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రత్యేక రాష్ట్రానికి టిడిపి సానుకూల వైఖరి ప్రదర్శించడంపై పట్ల తాను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. తమకు సమైక్యాంధ్రనే ముఖ్యమని, రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ఎడారిగా మారుతుందని అన్నారు.
సీమాంధ్ర సమైక్యతనే కోరుకుంటున్నారన్నారు. కర్ణాటకలో నిర్మించిన ప్రాజెక్టులతో రాష్ట్రంలో ఇప్పటికే నీటి ఎద్దడి ఏర్పడిందని, తెలంగాణ ఏర్పడితే కోస్తాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్లో విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మాదిరిగా టిడిపి తరఫున తాను కూడా చిత్తశుద్ధితో సమైక్యాంధ్ర కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు.