మోత్కుపల్లి అలక: ముద్దుకృష్ణమ, బొజ్జల రాయబారం
అలిగి పార్టీ కార్యక్రమాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్న తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉపనేత మోత్కుపల్లి నర్సింహులుతో ఆ పార్టీ సీనియర్ నేత ముద్దుకృష్ణమ నాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. వారు మంగళవారం హైదరాబాద్లో మోత్కుపల్లి నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.
తెలంగాణ అంశంపై నిర్వహించిన పొలిట్బ్యూరో సమావేశానికి తనను పిలవకపోవడంతో మనస్తాపానికి గురైన మోత్కుపల్లి ఆనాటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దాంతో ముద్దు, బొజ్జల ఆయనను కలిసి మాట్లాడారు. తనకు పార్టీపైనా.. పార్టీ అధ్యక్షుడిపైనా వ్యక్తిగత కోపమేమీ లేదని, కానీ ఇంత కీలక అంశంలో తనను పక్కన పెట్టేసినట్లు వ్యవహరించడం బాధ కలిగించిందని మోత్కుపల్లి వారితో చెప్పారు.
తెలంగాణపై ఏర్పాటు చేసిన పోలిట్బ్యూరో సమావేశం కావడంతో తనను ఆహ్వానించాల్సి ఉండిందనేది మోత్కుపల్లి నర్సింహులు అభిప్రాయం. నర్సింహులు పోలిట్బ్యూరో సభ్యుడు కాదు. దీంతో ఆయనకు ఆహ్వానం వెళ్లలేదని సమాచారం.