జైల్లో పెట్టాలనే: పరిటాల శ్రీరాం ఇష్యూపై బాబు సీరియస్
తెలుగుదేశం పార్టీ నేతల పైన కాంగ్రెసు ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని విమర్శించారు. తాను రెండు రోజులుగా శ్రీరామ్ అంశంపై వింటున్నానని చెప్పారు. అతనిని అన్యాయంగా, కావాలని జైలులో పెట్టించాలని చూస్తున్నారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కేసులో మంత్రి ధర్మాన ప్రసాద రావును ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి దొంగలకు కొమ్ము కాస్తున్నారన్నారు. వారి ఆటలు సాగనివ్వమన్నారు.
అధికారంలోకి వస్తే...
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మద్యం దుకాణాలను పూర్తిగా ఎత్తివేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కాంగ్రెసు ప్రభుత్వ పాలనలో నిత్యం ధరలు పెరుగుతున్నాయన్నారు. ఈ పెరుగుదల కారణంగా పేదల బతుకులు దుర్భరంగా మారాయన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి దోచుకున్న డబ్బును వసూలు చేస్తే ఐదుసార్లు రైతుల రుణాలను మాఫీ చేయవచ్చునని చంద్రబాబు చెప్పారు. ఆత్మకూరు - కామారం మధ్య చలి వాగుపై చెక్ డ్యామ్ నిర్మిస్తామని చంద్రబాబు స్థానికులకు హామీ ఇచ్చారు.
కాగా అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన పాదయాత్ర ఈ రోజు వరంగల్ జిల్లా కామారం నుండి బుధవారం ఉదయం ప్రారంభమైంది. పెంచికలపేట, దుగ్గొండి, మండలం కేశవపురం, లక్ష్మీపురం, పోనకల్, నాచినపల్లి, గిర్నిబావి మీదుగా ఆయన పాదయాత్ర సాగుతుంది.
తెలంగాణ జిల్లాల్లో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు తన టూర్లో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును టార్గెట్ చేసుకున్నారు. అఖిల పక్ష సమావేశంలో టిడిపి తెలంగాణకు అనుకూలమని చెప్పిన తర్వాత కెసిఆర్ పైన బాబు దూకుడు పెంచారు. కాంగ్రెసు పాలన, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల పైన కూడా ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు.