పరిటాల శ్రీరామ్కోసం సోదాలు: వేధింపులని సునీత ఫైర్
పరిటాల శ్రీరామ్ కోసం సొంతూరు వెంకటాపురంను పోలీసులు జల్లెడ పట్టారు. పరిటాల నివాసం ఉండే అరవిందనగర్లోనూ గాలించారు. పరిటాల రవీంద్ర బాబాయ్ ఎల్ నారాయణ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. అనుమతి లేకుండా సోదాలు చేయడంపై రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీత మండిపడ్డారు. అనుమతులు లేకుండా పోలీసులు ఎలా సోదాలు చేస్తారని ఆమె ప్రశ్నించారు.
ముందస్తు సమాచారం లేకుండా సోదాలు నిర్వహించడం సరికాదన్నారు. తన భర్త పరిటాల రవి హత్యకు ముందు ఇలాగే ఇంట్లో సోదాలు చేశారని ఆమె గుర్తు చేశారు. తన తనయుడు పరిటాల శ్రీరామ్ను కొందరు కావాలనే ఇరికించే ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. కాంగ్రెసు నేత హత్యకు కుట్ర కేసులో పోలీసులు విచారణ కోసం పిలిస్తే తన తనయుడిని తాను వెంట తీసుకొని వెళతానని చెప్పారు. అనుమతి లేకుండా చేస్తున్న సోదాలపై తాను స్పీకర్కు ఫిర్యాదు చేస్తానన్నారు.
తాను మహిళా ఎమ్మెల్యేని అని కూడా చూడకుండా తన ఇంట్లో సోదాలు నిర్వహించడమేమిటన్నారు. తన ఇంట్లోనే కాకుండా తన మావయ్య ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారన్నారు. ఇందులో రాజకీయ కుట్ర ఉందన్నారు. వారిని ఫాక్షన్ రాజకీయాలకు దూరంగా పెంచుతున్నానని, శ్రీరామ్ చదువుల కోసం విదేశాలకు వెళ్లే సమయంలో ఇలా చేస్తున్నారని, ఎస్పీతో మాట్లాడతామనుకున్నా ఆయన లైన్లోకి రావడం లేదన్నారు. కాగా శ్రీరామ్ పైన ధర్మవరం పోలీసు స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. మూడు బృందాలుగా చీలిన దాదాపు ముప్పై మంది పోలీసులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. శ్రీరామ్ అజ్ఞాతంలో ఉన్నట్లుగా భావిస్తున్నారు.