రేప్ విక్టిం పేరు వెల్లడించాలి కానీ... : శశిథరూర్ వ్యాఖ్య
బాధితారాలి తల్లిదండ్రులకు అభ్యంతరం లేకపోతేనే పునస్సమీక్షించిన అత్యాచార నిరోధక చట్టానికి ఆమె పేరును పెట్టాలని సూచించారు. ఆమె కూడా మనిషేనని, ఆమెకు ఓ పేరుంటుందని అన్నారు. ప్రస్తుత చట్టం ప్రకారం అత్యాచార బాధితుల గుర్తింపును, పేర్లను వెల్లడించటం లేదా ప్రచురించడం నేరం. బాధితురాలిని గుర్తించేలా కథనం ప్రచురించిన ఓ ఆంగ్ల దినపత్రికపై ఢిల్లీ పోలీసులు ఇప్పటికే కేసును నమోదు చేశారు.
శశి థరూర్ వ్యాఖ్యలకు కొందరు మద్దతివ్వగా మరికొందరు వ్యతిరేకించారు. అధికార కాంగ్రెసు పార్టీ శశి థరూర్ వ్యాఖ్యలకు దూరంగా ఉంది. శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు ఆయన సొంత అభిప్రాయమని, అతను ట్విట్టర్లో చేసిన కామెంట్స్తో కాంగ్రెసు పార్టీకి సంబంధం లేదని చెబుతున్నారు.
కాగా అత్యాచారం చేసిన అనంతరం వైద్య విద్యార్థినిని కీచకులు ఆమెపై నుంచి బస్సును నడిపించి హత్య చేయాలని ప్రయత్నించారు. బస్సులోంచి బయటకు తోసేసిన తర్వాత నిర్భయను ఆ బస్సు టైర్ల కింద నలిపేయాలని చూశారు. కానీ చివరి క్షణంలో మిత్రుడు ఆమెను పక్కకు లాగేశాడు. ఈ కేసుపై అభియోగపత్రంలో పోలీసులు ఈ వివరాలను క్రోడీకరించినట్లు తెలుస్తోంది.
పోలీసువర్గాల కథనం ప్రకారం - దక్షిణ ఢిల్లీలోని మునిర్కా బస్సు స్టాప్లో 'నిర్భయ', ఆమె మిత్రుడు బస్సు ఎక్కారు. అప్పటికే అందులో ఐదుగురు ఉన్నారు. వారు కూడా తమలాగే ప్రయాణికులని వారు భావించారు. కానీ.. బస్సు కదిలిన కాసేపటికే అసలు విషయం ప్రారంభమైంది. వారంతా 'నిర్భయ'పై, ఆమె స్నేహితుడిపై అసభ్య వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టారు.
కోపం వచ్చి ఆమె స్నేహితుడు ఒకరిపై చేయి చేసుకోగా గొడవ మొదలైంది. దీంతో దుండగులు ఇనుపరాడ్లతో అతడిని విపరీతంగా కొట్టారు. అడ్డువచ్చిన ఆమెనూ వదల్లేదు. నిందితుల్లో అక్షయ్కుమార్, ఇంకో బాలుడు కలిసి 'నిర్భయ'ను బస్సు వెనుక సీట్లవద్దకు లాక్కెళ్లారు. తర్వాత మిగతావారూ అత్యాచారానికి పాల్పడ్డారు. వారినుంచి తప్పించుకునే ప్రయత్నంలో అక్షయ్, రామ్సింగ్, వినయ్శర్మలను ఆమె కొరికింది. దాంతో ఆమెను మరోసారి తీవ్రంగా కొట్టారు.
చివరకు 'నిర్భయ'ను, ఆమె స్నేహితుడిని బస్సులోంచి నడిరోడ్డుపై తోసేశారు. అంతటితో వదలక అదే బస్సు టైర్లకు వారిని బలిచేయాలని చూశారు. తమవైపు బస్సు వేగంగా వస్తుండటం గమనించిన 'నిర్భయ' స్నేహితుడు చివరి క్షణంలో ఆమెను పక్కకు లాగేశాడు. ఇక ఆ తర్వాత సాక్ష్యాలు దొరక్కుండా డ్రైవర్ రామ్సింగ్ బస్సు మొత్తాన్నీ కడిగేసి, వస్త్రాలన్నింటినీ తగలబెట్టేశాడు.
ఈ కేసులో పోలీసులు నిందితులకు వ్యతిరేకంగా పలు రకాల సాక్ష్యాలను ప్రవేశపెడుతున్నట్లు తెలుస్తోంది. ఘటన సమయంలో బాధితురాలు కొరకడంతో ముగ్గురు నిందితుల శరీరాలపై పడ్డ పంటి గాట్లను సాక్ష్యంగా చూపనున్నారు. దాంతోపాటు ఆమెకు చికిత్స చేసిన సఫ్దర్ జంగ్ ఆస్పత్రి, సింగపూర్లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రి వైద్యుల నివేదికలు, పోస్టుమార్టం నివేదిక త్వరలోనే ఢిల్లీ పోలీసులకు అందనున్నాయి. ఇక రిజిస్ట్రేషన్ సమయంలో తప్పుడు చిరునామా ద్రువీకరణ పత్రం సమర్పించినందుకు బస్సు యజమాని దినేష్ యాదవ్పై మోసం కేసు నమోదైంది.