తెలంగాణతో ఆ డిమాండ్లకు లింక్ లేదు: రషీద్ అల్వీ
తెలంగాణపై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పేదే కాంగ్రెసు విధానమని ఆయన స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో దీన్ని ముడిపెట్టలేమని ఆయన అన్నారు. మజ్లీస్ శానససభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే తమ భవిష్యత్తు కార్యాచరణ ముడిపడి ఉందని రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మంగళవారం చెన్నైలో అన్నారు. రాష్ట్ర విభజనపై తమ కాంగ్రెసు పార్టీలో ఎవరి వాదన వారిదేనని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై 30 రోజుల్లో కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుండా ప్యాకేజీలతో సరిపుచ్చి కేంద్ర ప్రభుత్వం మోసం చేయాలని చూస్తోందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు టి. హరీష్ రావు విమర్శించారు. ప్యాకేజీల పేరుతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు, మంత్రులు, శాసనసభ్యులు రాజీనామాలు చేస్తే కేంద్రం తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైఖరిని తప్పు పట్టారు.