సిబిఐ విచారిస్తే అన్ని బయటపెడతా: కిరణ్తో కోమటిరెడ్డి
అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. జలయజ్ఞం ప్రాజెక్టులపై, తనపై ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలపై సిబిఐచే విచారణ జరిపించాలని తాను ముఖ్యమంత్రిని కోరానని చెప్పారు. ఉత్తమ్ ఆరోపించినట్లుగా తనకు ఎలాంటి కాంట్రాక్టులు, ప్రాజెక్టులు లేవని ఆయన స్పష్టం చేశారు. సిబిఐ విచారణలో తన దగ్గరున్న ఆధారాలను పూర్తిగా బయట పెడతానని కోమటిరెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు.
సిబిఐ విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించని పక్షంలో తాను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయిస్తానని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లాలో తన ఉనికి కాపాడుకునేందుకే తనపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను తెలంగాణ కోసమే తన మంత్రి పదవికి రాజీనామా చేశానని చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి జిల్లా ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు.
కాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డిల మధ్య ఇటీవల వేడి రాజుకున్న విషయం తెలిసిందే. తాను వదిలేసిన మంత్రి పదవిని ఉత్తమ్ కుమార్ స్వీకరించారని, అది తన భిక్షేనని కోమటిరెడ్డి విమర్షించగా.. కోమటిరెడ్డి తెలంగాణ కోసం రాజీనామా చేయలేదని, పోతిరెడ్డిపాడు కాంట్రాక్టులు దక్కించుకున్న వారు తెలంగాణవాదులు అవుతారా అని ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు.