శ్రీరామ్పై కేసు: చంద్రబాబుతో పరిటాలల సునీత భేటీ
తన కుమారుడు ఏ తప్పు చేయకున్నా కేసులు పెట్టారని, దీనిపై న్యాయపోరాటం చేస్తానని ఆమె చంద్రబాబుతో భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. కేసుల బనాయింపు వెనక అనంతపురం జిల్లా ధర్మవరం డిఎస్పీ, అనంతపురం ఎస్పీ కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. అనుమతులు లేకుండా తన ఇంటిలో పోలీసులు సోదాలు నిర్వహించడాన్ని శాసనసభా స్పీకర్ నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకుని వెళ్లినట్లు ఆమె తెలిపారు. 48 గంటల్లో న్యాయం చేస్తానని స్పీకర్ హామీ ఇచ్చినట్లు చెప్పారు.
పరిటాల శ్రీరామ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 7వ తేదికి వాయిదా పడిన విషయం తెలిసిందే. కాంగ్రెసు నేత కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర పన్నారనే కేసులో పరిటాల శ్రీరామ్ ఎ-14 నిందితుడిగా ఉన్నాడు. దీనిపై పరిటాల లాయర్ జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణను కోర్టు 7వ తేదికి వాయిదా వేసింది.
కాగా, పరిటాల శ్రీరామ్ కోసం రెండు రోజులుగా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. బుధవారం ఉదయం పరిటాల స్వగ్రామం అయిన వెంకటాపురంలో, బంధువుల ఇళ్లలో, అనుచరులు ఇళ్లలో.. అంతటా పోలీసులు పరిటాల శ్రీరామ్ కోసం వెతికారు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు గురువారం నాడు మరింత ముమ్మరం చేశారు. కర్నాటకలో శ్రీరామ్ ఉన్నాడనే సమాచారం పోలీసులకు వచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా అనంతపురం సరిహద్దులో ఉన్న కర్నాటకలోనూ పోలీసులు అతని కోసం వేట ప్రారంభించారు.
ఈ కేసులో మొత్తం 15 మందిపై కేసు నమోదయింది. నలుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. పరిటాల శ్రీరామ్తో సహా మరో పదకొండు మంది కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వీరి కోసం మూడు బృందాలు రంగంలో ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి పరిటాల శ్రీరామ్ను ఎఫ్ఐఆర్లో ఎ-14 నిందితుడిగా, నాగూర్ హుస్సేన్ను ఎ-15 నిందితుడిగా పేర్కొన్నారు.
సుధాకర్ హత్యకు పది లక్షల సుపారీ చేతులు మారినట్లుగా కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. పరిటాల శ్రీరామ్ విదేశాలకు వెళతాడనే సమాచారం రావడంతో పోలీసులు అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న కారణంగా బెయిల్ వచ్చే వరకు శ్రీరామ్ అజ్ఞాతంలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి.