హేట్ స్పీచ్: ఓవైసీ బ్రదర్స్ అధిపత్యానికి పరీక్ష
కాంగ్రెసుతో మజ్లీస్ తెగదెంపులు చేసుకుని వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసుతో చేతులు కలిపేందుకు సిద్ధపడింది. ఈ స్థితిలో అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీ సోదరులకు చేయూత అందించాల్సిన అవసరం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఏ మాత్రం లేదు. పైగా, మజ్లీస్పై కిరణ్ కుమార్ రెడ్డి కఠినంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు.
ప్రభుత్వం మద్దతు లేకుండా తమ ఆధిపత్యాన్ని హైదరాబాదులో కాపాడుకుంటారా అనేది ఓవైసీ సోదరులకు పరీక్షలాంటిదే. పెహల్వాన్ కుటుంబం ఇప్పటికే వారి నాయకత్వాన్ని సవాల్ చేస్తోంది. హైదరాబాద్ పాతబస్తీలో మజ్లీస్ వ్యతిరేక శక్తులు ఏకమవుతున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే, తమ సామాజిక వర్గం నుంచి అక్బరుద్దీన్కు మద్దతు లభిస్తుందని మజ్లీస్ వర్గాలంటున్నాయి.
అక్బరుద్దీన్ హిందూత్వ శక్తులపైనే తన దాడిని ఎక్కుపెట్టారని, ప్రభుత్వంపై కాదని, అందువల్ల తమకు మద్దతు ఉంటుందని మజ్లీస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇటీవలి దాకా మజ్లీస్కు కాంగ్రెసు మద్దతు కొనసాగుతూ వచ్చింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వం మద్దతు కూడా మజ్లీస్కు ఉంటూ వచ్చింది.
గతంలో కూడా అక్బరుద్దీన్పై కేసులు నమోదయ్యాయి. అయితే, ఆయన ఎప్పుడూ చట్టానికి చిక్కలేదు. ఆయనపై 2005నుంచి వివిధ పోలీసు స్టేషన్లలో ఆరు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. అయితే, దేంట్లోనూ ఆయనకు శిక్ష పడలేదు. నిజామాబాద్, నిర్మల్ల్లో చేసిన ప్రసంగాల కేసుల నుంచి కూడా అక్బరుద్దీన్ బయటపడతారని మజ్లీస్ పార్టీ నమ్ముతోంది.
అక్బరుద్దీన్పై 1994లో మహబూబ్నగర్ టూ టౌన్ పోలీసు స్టేషన్లో ఇరు వర్గాల మధ్య స్పర్థలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని అక్బరుద్దీన్పై కేసు నమోదైంది. ఆయనపై 2009లో నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయింది. దానిపై ఇంకా విచారణ సాగుతూనే ఉంది. హైదరాబాద్లోని భవానీ నగర్ ఘటన కేసు నుంచి ఆయనకు ఇటీవల విముక్తి లభించింది.
సోమవారం హైదరాబాదుకు రాక
అక్బరుద్దీన్ ఓవైసీ సోమవారం హైదరాబాదుకు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సోమవారం రాత్రి ఆయన హైదరాబాదు చేరుకుని మంగళవారం ఉదయం నిజామాబాద్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. లండన్ నుంచి రాగానే ఆయన పోలీసు స్టేషన్లకు హాజరు కావడానికి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.