రేప్ చేయాలని చూస్తే చంపొచ్చు: డిజిపి దినేష్ రెడ్డి
హైదరాబాదులోని మాదాపూర్ మహిళా ఐటి ఉద్యోగులతో ఆయన సోమవారం ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఐటి హబ్స్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల రక్షణకు తాము అధిక ప్రాధాన్యం ఇస్తామని ఆయన చెప్పారు. మహిళలపై నేరాలను అరికట్టడానికి పోలీసులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల భద్రతకు సైబరాబాద్ పోలీసులు వినూత్నమైన చర్యలు చేపట్టారని ఆయన అన్నారు.
సైబరాబాద్ పోలీసులు ఓ కాల్ సెంటర్ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వ రవాణా సౌకర్యం సరిగా లేకపోవడంతో క్యాబ్స్, ఆటో రిక్షాల్లో ప్రయాణిస్తున్నారని, అది భద్రం కాదని ఆయన అన్నారు. కాల్ సెంటర్ ఏప్రిల్ 11వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుందని ఆయన అన్నారు.
ఈవ్ టీజింగ్ వంటివాటిని నిరోధించడానికి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. రేప్ వంటి తీవ్రమైన నేరాలను తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. భద్రతా విషయాలపై తాను ఐటి నిపుణులతో తన కార్యాలయంలో కలవడానికి అందుబాటులో ఉంటానని ఆయన అన్నారు.