యుటిగా హైదరాబాద్: తెలంగాణకు వరంగల్, అంధ్రకు?
హైదరాబాదును కేంద్ర పాలితంగా ప్రాంతంగా చేసే అంశాన్ని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే అకస్మాత్తుగా మీడియా సమావేశంలో తెర మీదికి తెచ్చారు. రాష్ట్రాన్ని రెండుగా విభజించాలనే నిర్ణయానికి కాంగ్రెసు అధిష్టానం ఇప్పటికే వచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే తెలంగాణ నాయకులతో పాటు సీమాంధ్ర నాయకులు కూడా సంతృప్తి చెందుతారని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రానికి వరంగల్ను, సీమాంధ్ర రాష్ట్రానికి విజయవాడను రాజధానులుగా చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం నాడు కూడా కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్ర మంత్రులతో తెలంగాణపై మాట్లాడినట్లు తెలుస్తోంది. పాత హైదరాబాద్ రాష్ట్రాన్ని యధాతథంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం లేదని అంటున్నారు.
కర్నూలు, అనంతపురం జిల్లాలతో కలిపి గ్రేటర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లు, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాలను కలిపి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెబుతన్నారు. అయితే ఇది సాధ్యపడుతుందా అనేది అనుమానం. మహబూబ్ నగర్ కొన్ని ప్రాంతాలను మాత్రమే హైదరాబాద్ పరిధిలోకి తేవచ్చు. నల్లగొండ జిల్లాలోని 64 మండలాలను కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోకి తెచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.