మేం లేకుండా సమైక్యవాదమా: తెలంగాణ నేతల ప్రశ్న
శుక్రవారం నల్లగొండ జిల్లా చిట్యాలలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కలిసి ఉండడానికి ఉద్యమాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అధిక ప్రేలాపనలు చేస్తున్న మంత్రి దానం నాగేందర్లాంటి వాళ్లు తెలంగాణ రథచక్రాల కింద నలిగిపోతారని వ్యాఖ్యానించారు. జనం కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరని, అతి త్వరగా 2013లోనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. తెలంగాణ ప్రజా ప్రతినిధులు లేకుండానే సీమాంధ్ర నేతలు భేటీ అయితే అది సమైక్యవాద సమావేశం ఎలా అవుతుందని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీలు కెఆర్ ఆమోస్, కె.యాదవరెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ నేతలు ప్రత్యేక రాష్ట్రం కోసం కూర్చొని మాట్లాడుకున్నారంటే అర్థం ఉందన్నారు. తెలంగాణ వాళ్లను పిలవకుండా, వారు లేకుండా సమైక్యత ఎలా వస్తుందని సందేహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్పై రెఫరెండమ్ అన్న తెరాస అధ్యక్షుడు కెసిఆర్ వాదనకు మద్దతు ఇస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్పార్టీ తరఫున అఖిలపక్ష సమావేశానికి వెళ్లిన గాదె వెంకట రెడ్డి కూడా తెలంగాణను వ్యతిరేకించలేదని అన్నారు. హైదరాబాద్తో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని రాష్ట్ర మంత్రి బస్వరాజు సారయ్య ఆకాంక్షించారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని, కాంగ్రెస్ అధిష్ఠానాన్ని విమర్శించే స్థాయికి ఎదిగావా అని సీమాంధ్ర శాసనసభ్యుడు జోగి రమేష్పై మాజీ మంత్రి జీవన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణపై అధిష్ఠానం సానుకూల నిర్ణయం తీసుకోవడాన్ని తప్పుపట్టడంతో పాటు అధినేత్రి సోనియా నిర్ణయాలపై విమర్శలు గుప్పించడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని చెబుతున్న రమేష్ వెంటనే పార్టీని వీడి వెళ్లిపోవచ్చు కదా అని ప్రశ్నించారు. తెలంగాణాను వ్యతిరేకించడం అంటే, ఇక్కడి ప్రజల మనోభావాలను కించపరచడమేనని, అటువంటి వ్యాఖ్యలు చేయొద్దని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు కాంగ్రెస్ నేత మల్లు రమేష్ హితవు పలికారు.
హైదరాబాద్లో రెఫరెండం పెడితే తెలంగాణవాదమే గెలుస్తుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభ్యుడు హరీష్రావు స్పష్టం చేశారు. సీమాంద్రులు ఉన్నది జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ల్లోనేనని, తమ అడ్డగుట్ట ప్రజలు ఉఫ్మని ఊదితే వారంతా రెఫరెండంలో కొట్టుకుపోతారని వ్యాఖ్యానించారు.
విడిపోయే రాష్ట్రంలో సీఎం పదవి కోసమే గంటా శ్రీనివాసరావు, లగడపాటి లాంటివారి తంటాలని విమర్శించారు. ఇక హైదరాబాద్ను ప్రత్యేక రాష్ట్రం చేయాలన్న మంత్రి దానం ఎప్పుడేం మాట్లాడుతారో ఆయనకే తెలియదని హరీశ్ రావు అన్నారు.