మజ్లీస్కు మరో చిక్కు: ఎమ్మెల్యే పాషా ఖాద్రీపై కేసు
నిజాం నిర్మించిన భవనంలో కూర్చుని తమ చరిత్ర మార్చాలని చూస్తున్నారని మజ్లీస్ చార్మినార్ శాసనససభ్యుడు అహ్మద్ పాషా ఖాద్రీ కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జనవరి 17వ తేదీన అన్నారు. గాంధీజీ విగ్రహాన్ని తీసుకువచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టారని, ఎవరి బిల్డింగ్ అది అని, ఎవరిని కూర్చోబెట్టారని అన్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో గురువారం మజ్లిస్ ఆధ్వర్యంలో ఉర్దూ మీడియం పదో తరగతి విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. దీనికి హాజరైన అహ్మద్ పాషాఖాద్రీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎర్రకోటలోని ఎరుపు, కుతుబ్మినార్ బురుజులు, తాజ్మహల్ అందాలు, చార్మినార్ మెరుపులు, మక్కా మసీదు బురుజులు.. దేశంలోని పెద్ద కట్టడాలన్నీతమ పెద్దవాళ్లు నిర్మించినవేనని అంటూ మీరేం చేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. కట్టడాలను పరిరక్షించాలని మీకు అప్పగిస్తే విఫలమయ్యారని అన్నారు. ముస్లింలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జులుం చేస్తున్నారని ఆయన విమర్శించారు. హైకోర్టులో కేసు ఉన్నప్పటికీ బిజెపితో కలిసి చార్మినార్ వద్ద ఆలయానికి మరమ్మతులు చేయించి కోర్టుకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపించారు. ముస్లింలపై కక్షగట్టారని, ఇందులో భాగంగానే తమ నేత అక్బరుద్దీన్పై కేసు పెట్టించారని అన్నారు.
అక్బరుద్దీన్ను సరైన సౌకర్యాలు లేని ఆదిలాబాద్ జైలుకు తరలించారని మండిపడ్డారు. కేసులు తమకు కొత్తేమీ కాదని, అక్బరుద్దీన్ తండ్రి, తాతలు ప్రజల కోసం జైలుకు వెళ్లిన దాఖలాలు ఉన్నాయని అన్నారు. తాను కూడా జైలుకు వెళ్లానని, జైలు తమకు అత్తగారిల్లు వంటిదని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో ఎవరు మాట్లాడినా ఆయా శాఖల మంత్రులు సమాధానాలు ఇస్తారని, అక్బరుద్దీన్ మాట్లాడితే స్వయంగా ముఖ్యమంత్రి లేచి సమాధానం చెప్తారని అన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం మజ్లిస్ పార్టీ కొత్త పథకాలు చేపడుతోందని తెలిపారు. చట్టం అందరికీ సమానమైనా, తాము మాట్లాడితే జైలు శిక్ష విధిస్తారు కానీ ఇతరులు మాట్లాడితే మాత్రం చట్టం వర్తించదా? అని అడిగారు.