అత్త, భర్త కోసం సోనియా ఏడ్చారు కానీ: నాగం ఆవేదన
తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల పైన రాజకీయ ఒత్తిడి తీసుకు రావాలన్నారు. తెలంగాణకు అడ్డుపడుతున్న వారే టార్గెట్గా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరామ్ అన్నారు. మాలో శక్తి తగ్గలేదని, తెలంగాణ ఇవ్వకుంటే ఉద్యమం తీరు మారుతుందన్నారు. మిలిటెంట్ తరహా ఉద్యమాలు చేస్తామన్నారు. తెలంగాణను అడ్డుకుంటున్న సీమాంధ్రులనే లక్ష్యంగా రహస్య కార్యాచరణ రూపొందిస్తామన్నారు.
ఎన్నికలే లక్ష్యంగా ఉద్యమాలు చేయవద్దని నాగర్ కర్నూలు శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెసు పార్టీని తెలంగాణలో ఉరి తీయాలన్నారు. తన అత్తను, భర్తను కోల్పోయినందుకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కంటతడి పెట్టారని మరి, తెలంగాణ కోసం వెయ్యి మంది ఆత్మాహుతి చేసుకుంటే స్పందించరెందుకన్నారు. ఈ నెల 28 తర్వాత కాంగ్రెసు జెండా లేకుండా చేయాలన్నారు.
కాంగ్రెసు పార్టీ ఓ విచిత్ర పార్టీ అని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. పార్లమెంటులో తెలంగాణపై బిల్లు పెట్టే వరకు ఆ పార్టీని నమ్మే పరిస్థితి లేదని అన్నారు.
సీమాంధ్ర నేతలపై టి-కాంగ్ మండిపాటు
హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగమని మాజీ మంత్రి శంకర రావు వేరుగా అన్నారు. హైదరాబాదు ప్రత్యేక రాష్ట్రమంటున్న వారు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నారని ప్రశ్నించారు. వారివి అవగాహన లేని మాటలన్నారు. వారి మాటలు అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి బాగా లేదన్నారు. రాహుల్ గాంధీ ముందు అనేక సవాళ్లు ఉన్నాయన్నారు. తాము రేపు ఢిల్లీకి వెళుతున్నట్లు చెప్పారు.
హైదరాబాద్ తెలంగాణలో భాగమని ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ అన్నారు. తెలంగాణ ఇవ్వకుంటే కార్యాచరణ తీవ్రంగా ఉంటుందన్నారు. తెలంగాణను సీమాంధ్ర నేతలు అడ్డుకోవాలని చూస్తే ఒక్కరోజు కూడా హైదరాబాదులో వ్యాపారం చేయలేరన్నారు. తెలంగాణ వారిని రెచ్చగొట్టేలా సీమాంధ్ర నేతలు మాట్లాడవద్దని ఎమ్మెల్యే కెఎల్ఆర్ అన్నారు.