జగన్పై సహకార వ్యూహం!: ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్
ప్రధానంగా కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా లేనిచోట సొసైటీ ఎన్నికలను కిరణ్ కుమార్ రెడ్డి ప్రధానంగా వాయిదా వేయించినట్లుగా ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఆయన వైరి వర్గంగా ఉన్నారు. ఆయన ప్రభావితం చేయగలిగే ప్రాంతాలు ఇందులో ఉన్నాయి. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలుస్తుందని భావించినవి కూడా ఉన్నాయని అంటున్నారు.
సహకార ఎన్నికల్లో లాఠీఛార్జ్
చిత్తూరు జిల్లాలోని పీలేరు నియోజకవర్గంలో సహకార ఎన్నికల నామినేషన్ పర్వం ఘర్షణకు దారి తీసింది. సహకార ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా తమ వారిని అడ్డుకున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మద్దతుదారులు ఆందోళనకు దిగారు. కాంగ్రెసు నేతలు దాదాగిరిని అడ్డుకోవాల్సింది పోయి తమ పైనే పోలీసులు లాఠీఛార్జ్ చేశారని వారు ధ్వజమెత్తారు. జగన్ పార్టీ కార్యకర్తలు తిరుపతి - మదనపల్లె రహదారిపై బైఠాయించారు.
గుంటూరులో ఎమ్మెల్యే అరెస్టు
గుంటూరు జిల్లాలో సహకార ఎన్నికల నామినేషన్ల పర్వం ఉద్రిక్తతకు దారి తీసింది. నామినేషన్ వేసేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు వెళుతుండగా కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ కారు ధ్వంసమైంది. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని అరెస్టు చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడులో జరిగింది.