సిఎం పోస్టు, విలీనంపై సవాళ్లు: కెసిఆర్పై ముప్పేటదాడి
మంత్రి ప్రసాద్ కుమార్, సంగారెడ్డి శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి) తదితరులు కెసిఆర్ పైన క్రిమినల్ కేసు పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కెసిఆర్ వ్యాఖ్యల పైన ప్రభుత్వం స్పందించని పక్షంలో తాను కేసు పెడతానని జగ్గారెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కెసిఆర్ పైన పోలీసులకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
సమర దీక్షలో కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయనను ఇక్కట్లలోకి నెట్టాయని చెప్పవచ్చు. మజ్లిస్ పార్టీ నేతలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత కేసుల ఊబిలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అక్బర్ పైన కేసు పెట్టారని, ఇప్పుడు కెసిఆర్ పైన కూడా పెట్టాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్లు కెసిఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ మరో అడుగు ముందుకేసి కెసిఆర్కు సవాళ్ల పైన సవాళ్లు విసిరారు. కెసిఆర్ నుండి తాము ఉద్యమం నేర్చుకోవాల్సిన అవసరం లేదని, తాము తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నామని యాష్కీ అన్నారు. కెసిఆర్కు తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే భేషరతుగా తెరాసను కాంగ్రెసులో విలీనం చేస్తారా? అని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి పదవి, సీట్లు కోరకుండా కెసిఆర్ పార్టీని విలీనం చేయడానికి సిద్ధమైతే ముందుకు రావాలని సవాల్ చేశారు.
మాచవరం పిఎస్లో ఫిర్యాదు
మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ మాచవరం పోలీసు స్టేషన్లో తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన, కోదండరామ్ పైన ఫిర్యాదు చేశారు. కెసిఆర్ ప్రధాని, దేశాన్ని అవమానించేలా మాట్లాడారని ఆయనపై చర్యలు తీసుకోవాలని అడుసుమిల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు.