తెలంగాణకోసం పాక్నడగాలా?: కెటిఆర్, జగన్ ప్రస్తావన
తెలంగాణ ఏర్పడాలంటే భారత్ ఒప్పుకోవాలని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. అలాంటిది ఎక్కడా ఇప్పటి వరకు జరగలేదన్నారు. ఓట్లు, సీట్ల కోసమే తమ పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు ప్రయత్నాలు చేస్తున్నారని ఉండవల్లి చెప్పడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యం లేని పార్టీ కాంగ్రెసు పార్టీ అని మొదట గుర్తించాలన్నారు. తెలంగాణ విషయంలో నెంబర్ వన్ ద్రోహి కాంగ్రెసు పార్టీయే అన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏమాత్రం లేని పార్టీ అని మండిపడ్డారు.
తెరాసను కుటుంబ పార్టీ అని ఉండవల్లి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన ఏ పార్టీలో ఉన్నారో ఓసారి గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. జవహర్ లాల్ నెహ్రూ నుండి మొదలు సోనియా గాంధీ వరకు కాంగ్రెసు వారసత్వ పార్టీయేనని తెలుసుకోవాలన్నారు. 1956లో తెలంగాణకు సీమాంధ్రతో బలవంతపు పెళ్లి చేసింది నెహ్రూ అని, 1969లో ఉద్యమాన్ని అణిచివేసింది ఇందిరాగాంధీ అని, ఇప్పుడు సోనియా గాంధీ తాత్సారం చేస్తున్నారని అందుకే కాంగ్రెసే తెలంగాణ విషయంలో మొదటి దోషి అన్నారు.
సోనియాను తెలంగాణ వారు అంటే అంత మండిపడుతున్న కాంగ్రెసు నేతలు.. ఇది వరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు అన్నప్పుడు నోరు ఎందుకు మెదపలేదన్నారు. ఇటలీ మనిషి అని, ఇటలీ వర్సెస్ తెలుగు ప్రజలకు మధ్య ఎన్నికలు అని గతంలో జగన్ ఉప ఎన్నికల సందర్భంగా అన్నారని, అప్పుడు ఎందుకు మాట్లాడలేదన్నారు.
తాము మాటలంటేనే మీకు ఇంత రక్తం మరుగుతుంటే, చేతలతో మీరు చేస్తే మాకు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. హైదరాబాదుతో కూడిన తెలంగాణకు కేంద్రం సిద్ధపడితే.. రాజధానిలో ఉన్న సీమాంధ్ర ప్రజల భయాలు, అనుమానాలు తొలగించేందుకు తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.