సృష్టికర్త ప్రభుత్వమే:రక్షణస్టీల్స్కు హైకోర్టులో చుక్కెదురు
ఖమ్మం జిల్లా బయ్యారంలో 56,690 హెక్టార్లను రిజర్వు చేస్తూ జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ రక్షణ స్టీల్స్ హైకోర్టును ఆశ్రయించింది. ఆ సంస్థ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నర్సింహా రెడ్డి కొట్టివేశారు. ఎపిఎండిసితో ఒప్పందాన్ని, గనుల లీజును రద్దు చేస్తూ ప్రభుత్వం కొత్త జీవోలు ఇవ్వడాన్ని న్యాయమూర్తి సమర్థించారు.
ఎపిఎండిసికి ఎటువంటి హక్కులు సంక్రమించక ముందే రక్షణ స్టీల్స్ ఎంవొయు కుదుర్చుకుందని, ఆ తర్వాతే ప్రభుత్వం ఎపిఎండిసికి గనులను రిజర్వు చేసిందని, కార్పొరేషన్కు దీనిపై సర్వహక్కులు సంక్రమించవని, కార్పొరేషన్ సృష్టికర్త ప్రభుత్వమే అయినందున దానికి గనులు రిజర్వుచేస్తూ ఇచ్చిన ఆదేశాలు ఉపసంహరించుకొనే హక్కు ఉంటుందని, ఈ దశలో పిటిషనర్ సంస్థ, ఎపిఎండిసితో కలిసి ప్రయాణిస్తుందో లేదో వారే తేల్చుకోవాలని న్యాయమూర్తి సూచించారు.
బయ్యారం గనుల లీజుకు సంబంధించి రక్షణ స్టీల్స్ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు క్యాప్టివ్ మైనింగ్ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ దరఖాస్తు చేసుకొంటే, దానిని పరిశీలించి మెరిట్స్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో వాదనలు విన్న న్యాయమూర్తి రక్షణ స్టీల్స్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్లతో పాటు స్థానిక గిరిజనులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేశారు.