భూమి స్కామ్ కేసు: మాజీ మంత్రి శంకరరావు అరెస్టు?

గ్రీన్ఫీల్డ్ భూములను కబ్జా చేశారనే ఆరోపణలు వచ్చాయి. నేరేడ్మెట్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇది వరకే ఆయనను పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. కానీ, ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. అజ్ఞాతం వీడి వచ్చిన తర్వాత డిజిపి కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ఈ సమయంలో హృదయానికి సంబంధించిన వ్యాధితో హైదరాబాదులోని కేర్ ఆస్పత్రిలో చేరారు. దాంతో పోలీసులు ఇప్పటి వరకు ఆయన అరెస్టును నిలిపేశారు.
కేర్ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుని ఆయన బయటకు వచ్చారు. దీంతో శంకరరావు అరెస్టుకు పోలీసులు సిద్ధమయ్యారు. అజ్ఞాతంలోకి వెళ్లిన సమయంలో పోలీసులు ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అతి ముఖ్యమైన పత్రాలు లభించినట్లు తెలుస్తోంది. తన అరెస్టుపై స్టే తెచ్చుకోవడానికి శంకరరావు చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. తన సోదరుడితో కలిసి శంకరరావు గ్రీన్ఫీల్డ్ భూములను అక్రమంగా కబ్జా చేశారనే ఆరోపణలు వచ్చాయి.
విచారణ కోసమంటూ పోలీసులు తన భర్తను తీసుకుని వెళ్లారని శంకరావు సతీమణి విశ్వశాంతి అన్నారు. తన భర్త ఆరోగ్యం కూడా బాగాలేదని, భోజనం కూడా చేయనివ్వలేదని ఆమె ఓ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. నోటీసులు ఇవ్వకుండా తనను ఎలా అరెస్టు చేస్తారని శంకరరావు పోలీసులను ప్రశ్నించారు. భూకబ్జాకు సంబంధించి ఎలాంటి ఆధారాలున్నాయో తెలియదని, తాను విచారణకు సహకరిస్తామని చెప్పామని, ముఖ్యమంత్రి ఒత్తిడి తెస్తున్నారని, అందువల్ల అరెస్టు చేయకతప్పదని పోలీసులు చెప్పారని శంకర రావు కూతురు సుస్మిత అన్నారు.
హైదరాబాదు సమీపంలోని ఆల్వాల్ మున్సిపల్ పరిధిలోని కనాజిగుడా గ్రామానికి చెందిన 875 ప్లాట్లను రెగ్యులరైజ్ చేసే విషయంలో గ్రీన్ ఫీల్డ్ ఓనర్స్ అసోసియేషన్కు చెందిన 75 ఎకరాల భూమిని కబ్జా చేసిందుకు ప్రయత్నించారని కాలనీవాసులు శంకరరావుపై ఫిర్యాదు చేశారు. గ్రీన్ఫీల్డ్ ఓనర్స్ అసోసియేషన్ కాలనీవాసులు చేసిన ఫిర్యాదు మేరకు శంకరరావుపై నేరేడ్మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications