యాత్ర, మీడియాల ద్వారా దుష్ప్రచారం చేసినా..: బొత్స
తమకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే తమ పార్టీ సిద్ధాంతాల పట్ల విశ్వాసం, తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పట్ల విధేయత ప్రదర్సించి వచ్చే పార్టీలతో కలిసి పనిచేయడానికి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. సహకార సంఘాల ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించిన రైతులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెసు తెలుగుదేశం పార్టీతో కలిసిపోయిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెలుగుదేశం పార్టీ కాంగ్రెసుతో కలిసిపోయిందని వైయస్సార్ కాంగ్రెసు అన్నా, కాంగ్రెసు ఆటలు ఆడుతోందని తెరాస నాయకులు వారి భాషలో అన్నా ప్రజలు తమ పట్ల విశ్వాసం వ్యక్తం చేశారని ఆయన అన్నారు. ప్రజలకు మేలు చేస్తే వారు తమ పట్ల ఉంటారనే విషయం సహకార ఎన్నికల ఫలితాల ద్వారా వ్యక్తమైందని ఆయన అన్నారు. రెండో దశ సహకార సంఘాల ఎన్నికల్లోనూ తాము గెలుస్తామని ఆయన చెప్పారు.
అయితే, ఇబ్బందులు ఉన్నాయని, విద్యుత్తు సమస్య ఉందని, దాన్ని అధిగమించడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. పాదయాత్రల ద్వారా, మీడియా ద్వారా తమపై దుష్ప్రచారం సాగించి ప్రజల్లో అపోహలు కలిగించడానికి ప్రయత్నించారని ఆయన తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలను ఉద్దేశించి అన్నారు.