అరుదైన కేసుల్లో రేపిస్టులకు మరణశిక్ష: ఆర్డినెన్స్ జారీ
పారా మెడికల్ విద్యార్థినిపై జరిగిన ఘోర అత్యాచార ఘటన నేపథ్యంలో ఏర్పాటైన జస్టిస్ వర్మ కమిటీ చేసిన కీలక సిఫారసులను కేంద్రం ఆమోదించింది. జస్టిస్ వర్మ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించడానికి ప్రధాని మన్మోహన్సింగ్ నివాసంలో శుక్రవారం కేబినెట్ ప్రత్యేక సమావేశం జరిగింది. మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టే దిశగా కమిటీ చేసిన సూచనలను కేబినెట్ పరిశీలించింది. ఈ మేరకు సంబంధిత చట్టాలను సవరిస్తూ ఆర్డినెన్స్ను జారీ చేసింది.
రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ఆమోదంతో అమలులోకి రానున్న ఈ ఆర్డినెన్స్లో జస్టిస్ వర్మ కమిటీ చేసిన సిఫారసుల్లో కీలకమైనవాటిని యథాతథంగా చేర్చింది. దీన్ని ఆరు నెలల్లోగా పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. అనుమతి లేకుండా భార్యపై భర్త లైంగిక చర్యకు పాల్పడితే అత్యాచార నేరంగా పరిగణించాలని జస్టిస్ వర్మ కమిటీ సిఫారసు చేసినప్పటికీ కేంద్రం దాన్ని ఆర్డినెన్స్లో చేర్చలేదు.
అలాగే సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని సమీక్షించాలన్న సూచనను కూడా పట్టించుకోలేదు. కాగా, బాల నేరస్థుల వయసు తగ్గించే అంశం కూడా కేబినెట్లో చర్చకు వచ్చింది. ప్రజల నుంచి వస్తున్న ఈ డిమాండ్ను పరిశీలిస్తామని స్పష్టం చేసింది.