ముషార్రఫ్ హద్దు దాటారు: ధైర్యానికి వికె సింగ్ ప్రశంస
పాక్ దళాలు కార్గిల్లో దుస్సాహసానికి పాల్పడడానికి కొన్నివారాల ముందు అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ హెలికాప్టర్లో నియంత్రణరేఖను (ఎల్వోసీ) దాటి, భారత భూభాగంలో 11 కిలోమీటర్లు వచ్చి ఒక రాత్రి ఇక్కడ గడిపారు. ఈ విషయాన్ని ముషార్రఫ్ మాజీ సహచరుడొకరు ఇప్పుడు వెల్లడించారు. 1999 మార్చి 28న బ్రిగెడియర్ మసూద్ అస్లాంతో కలిసి నియంత్రణరేఖను దాటిన ముషార్రఫ్ జిక్రియా ముస్తకర్ అనే ప్రాంతంలో బస చేశారని, అక్కడ అప్పటికే కర్నల్ అమ్జద్ షబ్బీర్ నేతృత్వంలో పాకిస్థానీ దళాలున్నాయని పాక్ సైన్యంలోని మీడియా విభాగంలో సీనియర్ అధికారిగా పనిచేసిన కర్నల్ (రిటైర్డ్) అష్ఫక్ హుస్సేన్ తెలిపారు.
బయటపడిన కార్గిల్ కథ' పేరుతో 2008లో రాసిన పుస్తకంలో ఆయనీ విషయాలు వెల్లడించారు. ఇవే విషయాలను గురువారం రాత్రి జరిగిన ఓ టీవీ కార్యక్రమంలో పునరుద్ఘాటించారు. 1998 డిసెంబర్ 18న పాక్ దళాలు నియంత్రణ రేఖ వద్ద భారత భూభాగంలోకి చొచ్చుకెళ్లాయని, అయితే అలా ఎందుకు వెళ్లాల్సివచ్చిందో వారికి కూడా తెలియదని అన్నారు. తర్వాత కొద్దికాలానికే భారీ సంఖ్యలో దళాలను నియంత్రణ రేఖ దాటి భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాల్సిందిగా ఆదేశాలిచ్చారు.
దాంతో పోటీలు పడి మరీ దళాలు వెళ్లాయి. వీరిని ఓ గొర్రెల కాపరి గుర్తించి భారత సైనికులకు సమాచారం ఇచ్చినట్లు హుస్సేన్ తెలిపారు. ముషార్రఫ్ వచ్చి వెళ్లి నెలరోజులు దాటిన తర్వాత భారత్ - పాకిస్థానీ దళాల మధ్య కాల్పులు జరిగాయని చెప్పారు. అయితే, ఇది విజయవంతమైందనే ముషార్రఫ్ వాదనలను ఆయన ఖండించారు. శత్రువుతో ముఖాముఖి తలపడేవరకే అది విజయమని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ కేవలం 270 మంది సైనికులనే పోగొట్టుకుందన్న వాదన కూడా తప్పని, దాదాపు వెయ్యిమందికి పైగా మరణించారని చెప్పారు. కార్గిల్ విషయమై విచారణ తప్పించుకోడానికే నవాజ్ షరీఫ్ సర్కారును ముషార్రఫ్ కూలదోశారని హుస్సేన్ అన్నారు.