కింగ్ ఫిషర్ ఫ్యాషన్ షోకు బ్రేక్: దేవుళ్ల బొమ్మలు, కేసు
ఆదివారం ఉదయం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పోరేషన్(జివిఎంసి) ఎదురుగా ఉన్న జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మహిళా, విద్యార్థి, యువజన, కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మహిళలను అసభ్యంగా చూపించడం పైన, హిందూ దేవతలను కురచ దుస్తుల పైన ముద్రించడం పైన వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫ్యాషన్ షోలో దేవుడి బొమ్మలను ముద్రించి ఉన్న దుస్తులను వేసుకుంటున్నారని మరోవైపు విహెచ్పి ఆందోళన చేపట్టింది.
వారు విశాఖ మూడో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలా పలువురి నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పోలీసుల జోక్యంతో నిర్వాహకులు తగ్గారు. విహెచ్పి ఫిర్యాదుతో పోలీసులు నిర్వాహకుల పైన 295ఏ సెక్షన్ కింద కేసును నమోదు చేశారు.
ఫ్యాషన్ షో రద్దు మహిళలు, ఉద్యమకారుల విజయంగా మహిళా సంఘాల నేతలు, హక్కుల సంఘాల నేతలు అన్నారు. కాగా విశాఖలో కింగ్ ఫిషర్ ఫ్యాషన్ షో ఈ రోజు మూడో రోజు. ఫిబ్రవరి ఒకటిన ప్రారంభమైన ఈ షో రెండు రోజులు సాగింది. మూడో రోజు ఆందోళనకారుల కారణంగా నిలిపివేశారు.