సచిన్ వద్దకు మహిళ ప్లేయర్లు: గోకరాజుపై ఫిర్యాదు
కాగా సచిన్ టెండుల్కర్ ఆటోగ్రాఫ్ ఇప్పిస్తానని, ఆయనతో ఫోటో దిగేలా చేస్తానని చెప్పి నలుగురు మహిళా క్రికెటర్లను ఏసిఏ మాజీ కార్యదర్శి చాముండేశ్వరినాథ్ తీసుకు వెళ్లడం ఏమిటని ఏసిఏ ప్రస్తుత కార్యదర్శి గోకరాజు గంగరాజు శనివారం ప్రశ్నించిన విషయం తెలిసిందే. చాముండి గురించి అందరికీ తెలుసునని ఆయన అన్నారు. ఆయనపై ఆరోపణలు రావడంతో గతంలో ఏసిఏ కార్యదర్శి పదవి నుండి తొలగించామని, అలాంటి వ్యక్తితో సన్నిహితంగా ఉండటం వల్ల సచిన్కు చెడ్డ పేరు వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
సచిన్ వద్దకు చాముండి అమ్మాయిలను తీసుకు వెళ్లారని, మహిళా క్రికెటర్ల శిక్షణ శిబిరం జరుగుతుంటే వాళ్లలోంచి నలుగురిని స్టార్ హోటల్లో జిమ్కు పిలిపించారని గోకరాజు ఆరోపించారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్లో ఇది మరోసారి వివాదానికి దారి తీసింది. నలుగురినే చాముండి.. సచిన్ వద్దకు తీసుకు వెళ్లడమేమిటని, మంచి ఉద్దేశంతో తీసుకెళ్తే మొత్తం జట్టునంతటినీ తీసుకెళ్లాలని, జట్టులో 12 మంది క్రికెటర్లుండగా ఓ ఫైవ్స్టార్ హోటల్లో ఉన్న జిమ్లోకి కేవలం నలుగురు అమ్మాయిలనే చాముండి తీసుకు వెళ్లారని ఆరోపించారు.
సచిన్ అంటే తనకు అపార గౌరవం ఉందని.. కానీ అలాంటి వ్యక్తి చాముండేశ్వరినాథ్ లాంటి వాళ్లను పక్కన పెట్టుకోవడమే తనకు బాధాకరంగా అనిపించిందని గంగరాజు శనివారం వ్యాఖ్యానించారు. దీనివల్ల ఆయన ఇమేజికి కూడా భంగం వాటిల్లుతుందన్నారు. సచిన్ తిరుపతి వస్తున్నట్లు అసలు ఏసీఏకు సమాచారం కూడా లేదని, ఇప్పటికైనా సచిన్ వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని సూచించారు.
అయితే.. గంగరాజు ఆరోపణలపై చాముండేశ్వరి కూడా తీవ్రంగా స్పందించారు. పదవిని కాపాడుకోడానికే గంగరాజు ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సచిన్ టెస్ట్ మ్యాచ్గానీ, వన్డే మ్యాచ్గానీ అడటానికి వస్తే ఆయన్ను కలిసేందుకు కుదరదని.. దులీప్ ట్రోఫీ ఆడేందుకు వచ్చినందున కొంత వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఆయనతో ఫొటోలు తీయించుకోవాలనుకునేవారు, ఆటోగ్రాఫ్ తీసుకోవాలనుకునేవాళ్లు ఎవరైనా ఉంటే రావాల్సిందిగా తాను చెప్పానని ఆయన తెలిపారు.
అయితే ఆ సమయంలో అక్కడున్నవారిలో మిగిలిన అమ్మాయిలు అప్పటికే తాము వచ్చి 12 రోజులు అయినందున వెళ్లిపోతామన్నారని, నలుగురు మాత్రమే ఆసక్తి చూపడంతో వారిని తీసుకుని వెళ్లానని, దీనిపై గంగరాజు ఇలా వ్యాఖ్యానించడం సరికాదని చెప్పారు. ఇంత మాట అన్నప్పుడు మహిళా సంఘాలు ఏం చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. మహిళా క్రికెటర్లు ఏం తప్పు చేశారని వాళ్లు మాటలు పడాల్సి వస్తోందని నిలదీశారు.