జగన్కు ఝలక్: మళ్లీ టిడిపిలోకి దేవినేని సోదరుడు
తాను సామాన్య కార్యకర్తగా పార్టీలో చేరానని అన్నారు. పార్టీ తనపై నమ్మకముంచి ఏ పదవి ఇచ్చినా దానికి కట్టుబడి పని చేస్తానని చెప్పారు. కృష్ణా జిల్లాలో అందరినీ కలుపుకొని వెళ్తానని చెప్పారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తామని ఆయన అన్నారు. కృష్ణలో టిడిపి చనిపోయిందన్న కొందరు ఇతర పార్టీల నేతలకు తన చేరికే సరైన సమాధానం అని ఆయన అన్నారు. పార్టీ ఆదేశిస్తే దేవినేని నెహ్రూ పైన పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
దేవినేని చంద్రశేఖర్ చేరిక సందర్భంగా చందూ యువసేన హల్ చల్ చేసింది. విజయవాడలో పలుచోట్ల దేవినేని చంద్రశేఖర్ టిడిపిలో చేరుతున్నారంటూ బ్యానర్లు వెలిశాయి. చందూ యువసేన పేరుతో ఆ బ్యానర్లు వెలిశాయి. ఆయన చేరిక సందర్భంగా చందూ యువసేన తరలి వచ్చింది. కాగా దేవినేని చంద్రశేఖర రావు గతంలో టిడిపి నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఇప్పుడు మళ్లీ టిడిపిలో చేరారు.
కాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. జనవరి చివరలో నాలుగు రోజులు విశ్రాంతి తీసుకున్న బాబు 31వ తారీఖు నుండి తిరిగి పాదయాత్రను పునఃప్రారంభించారు.