హైదరాబాద్ పోలీసులు ఇలా చేశారా? యువతి వీడియో వైరల్
మహిళల రక్షణకు పెద్ద పీట వేస్తున్నామని తెలంగాణా ప్రభుత్వం చెప్తోంది. అయితే క్షేత్ర స్థాయిలో అలాంటిదేమీ లేదని తాజాగా జరిగిన ఒక ఉదంతం అందరికీ తెలిసేలా చెప్తుంది. అర్దరాత్రి వేళ రైల్వే స్టేషన్ సమీపంలో చిక్కుకుపోయిన ఒక మహిళ తన సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తుంది.
లింగంపల్లి రైల్వేస్టేషన్ పరిధిలో ఘటన
లింగంపల్లి రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఒక మహిళా ప్రయాణికురాలి పట్ల స్థానిక పోలీసులు ప్రదర్శించిన నిర్లక్ష్య వైఖరి తీవ్ర చర్చనీయాంశమైంది. అర్ధరాత్రి వేళ ఒంటరిగా చిక్కుకుపోయిన ఒక ప్రయాణికురాలికి తగిన రక్షణ కల్పించడంలో, సహాయం చేయడంలో పోలీసులు విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ మహిళ ఒక వీడియో ద్వారా తనకు ఏం జరిగిందో షేర్ చేసుకోవటం ప్రస్తుతం చర్చకు దారి తీసింది.

రైల్వే స్టేషన్ వద్ద పోలీసుల రక్షణ కోరిన యువతి
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి హైదరాబాద్ నగరానికి ఒక మహిళ రైలులో ప్రయాణం చేసింది. అయితే సదరు రైలు తీవ్రంగా ఆలస్యం కావడంతో.. అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1.45 గంటల సమయంలో ఆమె లింగపల్లి రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఆ సమయంలో స్టేషన్ వెలుపల అంతా చీకటిగా ఉండటం, వాహనాల రాకపోకలు లేకపోవడం, పైగా తాను ఒంటరిగా ప్రయాణిస్తుండటంతో భయపడిన ఆ యువతి తక్షణ రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించింది.
ఇంటి దగ్గర దింపాలి అన్న రూలేం లేదన్న ఖాకీలు
వెంటనే పోలీసు హెల్ప్లైన్ నంబర్కు ఫోన్ చేసి సహాయం కోరింది. కానీ కష్ట కాలంలో ఆదుకోవాల్సిన ఖాకీల నుండి ఆమెకు తీవ్ర నిరాశ, అవమానమే ఎదురయ్యాయి. తనను ఇంటి వద్ద దింపాలని అడిగిన యువతికి, అలాంటి రూల్ ఏమీ లేదని, అయినా ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని తెలీదా అంటూ పోలీసులు ఆమెతో దురుసుగా ప్రవర్తించారని ఆమె వీడియోలో షేర్ చేసింది.
మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు ఎక్కడ?
రాత్రి వేళల్లో మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం పట్ల ప్రజలు మరియు స్వచ్ఛంద సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సంఘటన స్థానికంగా మరియు సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో, పోలీస్ ఉన్నతాధికారులు దీనిని చాలా తీవ్రమైన అంశంగా పరిగణించారు.
మహిళా రక్షణ విషయంలో అంతర్గత విచారణకు ఆదేశాలు జారీ
మహిళల రక్షణ విషయంలో ఏమాత్రం అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టం చేస్తూ, బాధ్యులైన పోలీస్ సిబ్బందిపై తక్షణమే అంతర్గత విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విచారణ ద్వారా అసలు ఆ రాత్రి ఏం జరిగింది? విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు? అనే విషయాలను సమగ్రంగా సేకరించనున్నారు. ఒకవేళ విచారణలో పోలీసుల తప్పు నిరూపితమైతే వారిపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు భరోసా ఇచ్చారు.












Click it and Unblock the Notifications