'సినీ' 'లీడర్స్': జయ నుండి జయ వరకు తెలంగాణపై...
హైదరాబాద్: తెలంగాణపై ఢిల్లీలో రాజకీయ వేడి రాజుకుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండి తెలంగాణపై కాంగ్రెసు పెద్దలతో చర్చించారు. మరో రెండు మూడు రోజుల్లో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గవర్నర్ నరసింహన్ కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వారికి ఢిల్లీ పెద్దల నుండి పిలుపు వచ్చినట్లుగా జోరుగా వార్తలు వచ్చాయి.
మరోవైపు కేంద్రం ఎక్కడ తెలంగాణ ప్రకటిస్తుందో అనే ఆందోళనతో సీమాంధ్రలో సమైక్యాంధ్ర ర్యాలీలు, ధర్నాలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు సమైక్యాంధ్ర ఆందోళనల్లో పాల్గొంటున్నారు. తెలంగాణవాదులు కేంద్రం తెలంగాణపై సాధ్యమైనంత త్వరగా తేల్చాలని, అనుకూలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ నాయకులు, పార్టీలు కొందరు తెలంగాణకు వ్యతిరేకంగా, మరికొందరు అనుకూలంగా ఉన్నారు.
అయితే సినిమాల నుండి వచ్చి రాజకీయాల్లో చేరిన పలువురు 'సినీ' 'నేతలు' కూడా తెలంగాణకు పరోక్షంగా, ప్రత్యక్షంగా మద్దతు పలుకుతున్నారు. కొందరు తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తున్నామని చెబుతున్నారు. మరికొందరు ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూనే తెలంగాణ న్యాయమైన డిమాండ్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నిరంతరం ఉద్యమాల కంటే తేల్చేయడమే మంచిదనే అభిప్రాయంతో ఉన్నారు.
ఎంపి వి'జయ'శాంతి తెలంగాణ సాధన కోసం తెరాసలో చేరారు. అంతకుముందు ఆమె బిజెపిలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ గళం గట్టిగానే వినిపించారు. ఒక ఓటు రెండు రాష్ట్రాలు హామీని బిజెపి నెరవేర్చలేదని విజయశాంతి తెలంగాణ సాధన కోసం ఉద్భవించిన తెరాసలో చేరారు.
హీరో, టిడిపి నేత బాలకృష్ణ తెలంగాణకు వ్యతిరేకం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అఖిల పక్షంలో టిడిపి తెలంగాణకు అనుకూలంగా చెప్పింది. తెలంగాణ ప్రజల మనోభావాలను టిడిపి గౌరవిస్తుందని, వ్యతిరేకం కాదని చెప్పారు. బాలయ్య తెలంగాణకు అనుకూలంగా చెప్పినప్పుడు, అఖిల పక్షంలో టిడిపి తెలంగాణకు అనుకూలంగా చెప్పినప్పుడు టిటిడిపిలో కొత్త ఉత్సాహం కనిపించింది. శ్రీరామరాజ్యం విడుదల సమయంలో బాలయ్య వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వాటిపై బాలయ్య వివరణ కూడా ఇచ్చుకున్నారు.
యుపిలోని రాంపూర్ ఎంపీ జయప్రద ప్రజల మనోభావాలను గుర్తించాలని ఇటీవల చెప్పారు. తాను సీమాంధ్ర నుండి వచ్చినప్పటికీ తెలంగాణ ప్రజలు కూడా తనను ఆదరించారని, వారి భావాలను కేంద్రం గుర్తించాలని, త్వరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.
హీరో సుమన్ తెలంగాణవాదిగా ముద్రపడ్డారు. ఆయన విజయశాంతి, ఇతర తెరాస నేతలతో కలిసి కొన్నిసార్లు ఆందోళనల్లో పాల్గొన్నారు.
పీపుల్స్ స్టార్ నారాయణ మూర్తి తెలంగాణ వాదం గట్టిగా వినిపిస్తున్నారు. విభజన ద్వారానే రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అంటారు. అందుకే ఆంధ్రలో పుట్టిన తాను తెలంగాణవాదం వినిపిస్తున్నానని పలుమార్లు చెప్పారు.
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా తెలంగాణకు జై కొట్టిన వారే!
సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ తెలంగాణకు అనుకూలమని చెప్పనప్పటికీ వెంటనే తేల్చాలని, ప్రజాందోళనను పరిగణలోకి తీసుకోవాలనేది ఆమె అభిప్రాయం.