'ఆధార్' ఆందోళన వద్దు: రెండు జిల్లాల ప్రజలకు కిరణ్
ఆయన బుధవారం సచివాలయంలో ఆధార్ కార్డులపై అధికారులతో అత్యవసరంగా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్యాస్ రాయితీకి ఫిబ్రవరి 15 గడువు కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు. రెండు జిల్లాల ప్రజలు ఆందోళన చెందుతున్నారని, అదేమీ వద్దన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అత్యవసరంగా 300 ఆధార్ కేంద్రాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆధార్ కార్డులు పోగొట్టుకున్న వారికి, రాని వారికి 60 మీ సేవా కేంద్రాల ద్వారా డూప్లికేట్ కార్డులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.
కాగా ఆధార్ కార్డుల కోసం రంగారెడ్డి, హైదరాబాద్ ప్రజలు బారులు తీరుతున్నారు. ఈ నెల 15వ తేది నుండి ఆధార్ కార్డు ఉంటే గ్యాస్ రాయితీ వస్తుందన్న వార్తల నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆధార్ కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. హైదరాబాదుతో పాటు జిల్లాల్లో కూడా జనం ఆధార్ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. పిల్లా పాపలతో గంటల తరబడి క్యూ లైన్లలో నిలుచుంటున్నారు.
మంగళవారం హయత్ నగర్ ఆధార్ కేంద్రం అర్ధాంతరంగా మూసి వేయడంతో జనం ఆగ్రహం పట్టలేక రాళ్లతో దాడి చేశారు. దీంతో కేంద్రం కిటికీ అద్దాలు పగిలిపోయాయి. అయితే ఆధార్ కోసం జనం పడుతున్న ఇక్కట్లు తన దృష్టికి రావడంతో ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. గ్యాస్ - ఆధార్ లింకును వాయిదా వేయాలని ఆయన మంగళవారం కేంద్రాన్ని కోరారు. రాత్రి ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చిన కిరణ్ ఈ రోజు అధికారులతో సమావేశమై ఆధార్ కార్డుల ప్రక్రియ వేగవంతమయ్యేలా చర్యలకు ఆదేశాలు జారీ చేయడమే కాకుండా గ్యాస్ - ఆధార్ లింక్ గడువును పెంచుతున్నట్లు చెప్పారు.