ములాయం ప్రకటన: చంద్రబాబుకు రాజకీయ ఉత్తేజం
2014 లోక్ సభ ఎన్నికల్లో మూడో ఫ్రంట్ అధికారంలోకి రావడం ఖాయమని మూలాయం సింగ్ యాదవ్ జోస్యం చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకల గ్లామర్ పనిచేయడం లేదని ములాయం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్లో గాంధీ కుటుంబానికి తప్ప వేరే వారికి చోటు లేదని ఆయన విమర్శించారు.
భారత్-అమెరికా అణు ఒప్పందానికి మద్దతు ఇచ్చి తప్పు చేశామని ములాయం సింగ్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారని ములాయం వ్యాఖ్యానించారు. తనను దెబ్బతీసేందుకే కాంగ్రెస్ సీబీఐని ఉసికొల్పారని ధ్వజమెత్తారు. కాంగ్రెసుతో తెగదెంపులు చేసుకోవడానికి ములాయం సింగ్ సిద్ధంగా ఉన్నట్లు ఈ ప్రకటన సంకేతాలు ఇస్తోందని అంటున్నారు.
ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో తగిన సీట్లను సాధించుకోవడం ద్వారా తృతీయ ఫ్రంట్ను అధికారంలోకి తేవడానికి ప్రయత్నించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ములాయం కాంగ్రెసు వ్యతిరేక వైఖరి తృతీయ ఫ్రంట్కు దేశంలో ఊపిరి వస్తుందని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు. అటు బిజెపితోనూ, ఇటు కాంగ్రెసుతోనూ కలిసి పనిచేయలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారు. దీంతో తృతీయ ఫ్రంట్ వల్ల జాతీయ స్థాయిలో మరోసారి తమ పార్టీ కీలక పాత్ర పోషించే అవకాశాన్ని పొందుతుందని ఆయన భావిస్తున్నారు.