రెండో రాజధానిగా హైదరాబాద్: సోమిరెడ్డి, షర్మిలపై కళా
సోమిరెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాదును రెండో రాజధానిగా చేయాలని అన్నారు. హైదరాబాదును రెండో రాజధాని చేస్తే తెలుగు వారి ప్రతిష్ట మరింత పెరుగుతుందన్నారు. అంతేకాకుండా సుప్రీం కోర్టు బెంచ్ కూడా ఏర్పాటు అవుతుందన్నారు. రెండో రాజధానిగా చేసేందుకు పార్టీలకతీతంగా అందరూ కృషి చేయాలన్నారు. ఈ అంశాన్ని పార్టీలో చర్చకు పెడతానని చెప్పారు. తాను తెలంగాణవాదాన్ని పక్కదారి పట్టించేందుకు రెండో రాజధాని అంశాన్ని లేవనెత్తలేని వివరణ ఇచ్చారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నా విడిపోయినా హైదరాబాద్ రెండో రాజధాని కావలన్నది తన కోరిక అన్నారు.
ఎన్నికలకు సిద్ధం
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన రావు బుధవారం చెప్పారు. సహకార ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ గెలుచుకున్న సొసైటీలు అధికార దుర్వినియోగానికి పాల్పడి సాధించినవే అని ఆరోపించారు. రైతులు మనసా వాచా టిడిపితోనే ఉన్నారన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తమ పార్టీ సిద్ధమే అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పదవిని కాపాడుకునేందుకే నిత్యం ఢిల్లీ పర్యటనలు జరుపుతున్నారని కళా వెంకట్రావు అన్నారు. ఆయన పర్యటనలు ఓట్లు, సీట్లకు పరిమితమవుతున్నాయని విమర్శించారు. కేంద్రం నుండి నిధులు తెప్పించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెసు ఎంపీలు విఫలమవుతున్నారని ధ్వజమెత్తారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ బైబిల్ చేతిలో పట్టుకొని, కూతురు షర్మిల మైకు చేతులో పట్టుకొని అబద్దాలు చెప్పడం మానుకోవాలని సూచించారు. రాష్ట్ర సంపద దోచుకున్న కుటుంబం ఇప్పుడు దేవుడి పేరు ఉపయోగించుకుంటుందని మండిపడ్డారు.