ప్రజాభిప్రాయం ఉద్రిక్తం: కలెక్టర్ పైకి చెప్పులు!, వాయిదా

సమీప పది గ్రామాల నుండి వేలాది మంది గ్రామస్థులు ప్రజాభిప్రాయ సేకరణ స్థలానికి చేరుకున్నారు. అభిప్రాయాలు సేకరించవద్దని నినాదాలు చేశారు. అధికారులు వెంటనే ఇక్కడి నుండి వెళ్లి పోవాలని హెచ్చరించారు. తాము అభిప్రాయాలు మాత్రమే సేకరించేందుకు వచ్చామని అధికారులు చెప్పారు. అయితే వినిపించుకోని ఆందోళనకారులు తమకు ప్రాజెక్టు వద్దంటూ నినాదాలు చేశారు.
దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసుల పైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ప్రజాభిప్రాయ సేకరణ సభా స్థలి పైకి గుర్తు తెలియని వారు చెప్పులు విసిరారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో కలెక్టర్, ఇతర అధికారులు సేకరణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆందోళనకారులు అక్కడున్న కుర్చీలను విరగ్గొట్టారు. టెంటులను కింద పడగొట్టారు. అధికారులు బిక్కవోలు మండలం దొంతమూరు గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ తలపెట్టారు.
తమకు ప్రాజెక్టు అవసరం లేదని పలువురు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు పోలీసులు ఆందోళనకారులు తమపై రాళ్ల దాడి చేసిన తర్వాత స్వల్పంగా లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టామని చెబుతున్నారు. అభిప్రాయం సేకరించేందుకే అధికారులు వచ్చినప్పుడు అడ్డుకోవడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications