రాజపక్సేతిరుమల పర్యటన: రోడ్డెక్కిన కరుణనిధి,స్టాలిన్
తిరుపతి/చెన్నై: శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సె తిరుమల పర్యటనను నిరసిస్తూ చిత్తూరు జిల్లా తిరుపతిలో భారీగా పోస్టర్లు వెలిశాయి. రాజపక్సే శ్రీలంకలోని లక్షా యాభై వేల మంది తమిళులను పొట్టన పెట్టుకున్నారని, ఆ దేశంలోని హిందూ దేవాలయాలను కూల్చి వేయించారని ఆరోపిస్తూ పోస్టర్లు, కరపత్రాలు వెలిశాయి. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు తిరుపతిలో 144వ సెక్షన్ విధించారు.
రాజపక్సేను అడ్డుకుంటామని తమిళ ప్రజా సంఘాలు, పిఎంకే నేత వైగో హెచ్చరించారు. దీంతో తిరుపతి, తిరుమలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. పోస్టర్లు, కరపత్రాలకు సంబంధించిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమల విష్ణు నివాసం వద్ద దాదాపు 200మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకోవైపు రాజపక్సేను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున తమిళులు తిరుపతికి చేరుకుంటున్నారు.
రాజపక్సేకు వ్యతిరేకంగా తిరుపతి రైల్వే స్టేషన్లో శుక్రవారం ఉదయం తమిళ సంఘాలు ఆందోళన చేపట్టాయి. దాదాపు వంద మంది తమిళులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజపక్సే పర్యటనను అడ్డుకునేందుకు తమిళనాడు నుండి వాహనాల్లో తిరుపతికి వస్తున్న ఆందోళనకారులను చిత్తూరు జల్లా పోలీసులు ఎక్కడికి అక్కడే అడ్డుకుంటున్నారు. రాజపక్సేకు పర్యటన సాఫీగా సాగేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు.

తమిళనాడులో నిరసన
శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే తిరుమల పర్యటనకు చెన్నైలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతిలో తమ మూవ్మెంటుకు చెందిన పలువురు కార్యకర్తలను నిన్న సాయంత్రం ఐదు గంటల సమయంలో అరెస్టు చేశారని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు లిబరేషన్ మూవ్మెంట్ ప్రకటించింది. కాగా తమిళ లిబరేషన్ మూవ్మెంట్ ఆందోళనతో చెన్నైలోని ఓ హోటల్లో శ్రీలంక జెండాను తొలగించారు.
రాజపక్సే రాకను నిరసిస్తూ డిఎంకే ఆందోళన చేపట్టింది. చెన్నైలో ఆ పార్టీ చేపట్టిన ర్యాలీలో డిఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, పార్టీ నేత స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. కాగా సాయంత్రం రాజపక్సె తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.












Click it and Unblock the Notifications