తగ్గని కోపం: జయలలితపై కమల్ హాసన్ వ్యాఖ్యలు
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్కు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై ఆగ్రహం తగ్గినట్లు లేదు. తమిళనాడులో తన విశ్వరూపం సినిమాను నిషేధించడం దగ్గరి నుంచి ముస్లిం సంఘాల నేతలతో చర్చించి కోతలు పెట్టుకోవడం వరకు తనకు అవమానం జరిగిందనే భావనకే ఆయన గురైనట్లు కనిపిస్తున్నారు. హైదరాబాదులో శుక్రవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడిన తీరు ఆ విషయాన్ని తెలియజేస్తోంది. జయలలిత తీరును ఉద్దేశించే ఆయన ఎక్కువగా మాట్లాడినట్లు అర్థమవుతోంది.
తాను రాజకీయ నాయకుడిని కానని ఆయన అన్నారు. తాను రాజకీయ నాయకుడిని కానని, ఇక ముందు కూడా కాబోనని అన్నారు. రాజకీయం చీకటి నది లాంటిదని, తాను దాని తీరం మీద మాత్రమే నిలబడుతానని అన్నారు. ఈ మాటలను ఆయన జయలలితను ఉద్దేశించే అన్నట్లుగా భావిస్తున్నారు. అల్లర్లకు కళాకారులు ఎప్పుడూ కారణం కాలేదని స్పష్టం చేశారు.
జరిగిన సంఘటనపై తనకు ఆగ్రహం లేదని, విచారమేస్తోందని, భారత్ వంటి స్వతంత్ర, విశాలమైన దేశంలో ఈ విధంగా కళాకారుడికి అవమానం జరిగిందని ఆయన అన్నారు. అల్లర్లకు కళాకారులు కారణమైన సందర్భాలు చాలా తక్కువ అని అన్నారు.

కళాకారులుగా తాము ప్రపంచాన్ని కలిపి ఉంచడానికి ప్రయత్నిస్తామని, చాలా అద్భుతాలు చేస్తామని, తాము నిజానికి వైద్యులమని, అయితే మీరు అల్లర్లను సృష్టించేవారిగా చూస్తున్నారని, ఇది అవమానకరమని ఆయన అన్నారు. తాను సోక్రటీస్ కుమారుడిని అని, ఓ కప్ విషాన్ని ఇస్తే దాన్ని సేవించి స్వేచ్ఛ గురించి మాట్లాడుతానని అన్నారు.
ముస్లింల మనోభావాలను దెబ్బ తీశారంటూ తమిళనాడు ప్రభుత్వం విశ్వరూపం సినిమా విడుదలను నిషేధించింది. ముస్లిం సంఘాలతో చర్చించి, కొన్ని కోతలు పెట్టిన తర్వాత తమిళనాడులో ఫిబ్రవరి 7వ తేదీన సినిమా విడుదలైంది. అయితే, అంతకు ముందే విశ్వరూపం సినిమా కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విడుదలైంది.












Click it and Unblock the Notifications