కేసుల వెంటే...: ఓవైసీ బ్రదర్స్కు కిరణ్ మరో ఝలక్!?
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత ఒవైసీ సోదరులకు సర్కారు ఇచ్చిన అతి పెద్ద షాక్ ఇదే అని చెప్పవచ్చు. బండ్లగూడలోని ఒవైసీ ఆస్పత్రి సమీపంలో మూడున్నర ఎకరాల గ్రామకంఠం భూమి ఉంది. దీని పక్కనే కేంద్ర ప్రభుత్వ సంస్థ మిధానీ ఉంది. ఈ భూమిలో రెండున్నర ఎకరాలు ఇతరుల చేతుల్లో ఉంది. పేరుకే ఇతరుల చేతుల్లో అన్నప్పటికీ వెనుక ఓవైసీ ఆసుపత్రి ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయి.
నవీన్ మిట్టల్ హైదరాబాద్ కలెక్టర్గా ఉన్న సమయంలో ఎన్నో ప్రభుత్వ భూములకు నిరభ్యంతర పత్రాలు (ఎన్ఒసి) ఇచ్చారు. వాటిల్లో ఈ భూమి కూడా ఉంది. మిట్టల్ తర్వాత హైదరాబాద్ కలెక్టర్గా గుల్జార్ వచ్చారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములపై ఆయన దృష్టిపెట్టారు. మిధానీ భూముల అన్యాక్రాంతంపై సిపిఎం పార్టీ ఆయనకు వివరించింది. గ్రామ కంఠంగా ఉన్న మిధానీ భూములను ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చారని, ఇది అక్రమమని ఆయన తేల్చారు.
ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్న డాక్యుమెంట్లను పరిగణనలోకి తీసుకొని ఆ భూమి ముమ్మాటికీ ప్రభుత్వానిదేనని నిర్థారించారు. అనంతరం, ఆ భూమిపై ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన ఎన్ఒసిని రద్దు చేయాలని కోరుతూ భూపరిపాలన ప్రధాన కమిషనర్కు లేఖ రాశారు. అప్పటి సిసిఎల్ఎ మిన్నీ మాథ్యూ ఆ లేఖను తీవ్రంగా పరిగణించి నిశితంగా పరిశీలించారు. ప్రత్యేకంగా మరోసారి అధ్యయనం చేసి అది ప్రభుత్వ భూమేనని తేల్చారు. ఆ తర్వాత అనూహ్యంగా మిధానీ భూములపై స్టే ఉత్తర్వులను ఉపసంహరిస్తూ నాలుగు రోజుల కిందట రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బిఆర్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.